ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ప్రియురాలి నిరసన

by Sridhar Babu |
ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ప్రియురాలి నిరసన
X

దిశ, భిక్కనూరు : తనను పెళ్లి చేసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తాళం వేసి ఉన్న ప్రియుడు ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి యువతి బైఠాయించి ఆందోళనకు దిగిన వైనం కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన ఎంబరి ప్రశాంత్, అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. నాలుగు సంవత్సరాలుగా ప్రేమాయణం కొనసాగిస్తుండగా ప్రశాంత్ కు మరో అమ్మాయితో వారి కుటుంబ సభ్యులు వివాహం చేయాలని చూశారు. అది తెలిసి సదరు బాధితురాలు ప్రియుడి ఇంటికి వెళ్లి ప్రేమాయణం గురించి ప్రియుడి కుటుంబ సభ్యులకు వివరించింది.

అంతటితో ఊరుకోకుండా తనను శారీరకంగా వాడుకున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం కింద కేసు నమోదు చేసి ప్రశాంత్​ను జైలుకు పంపించారు. రెండు నెలలు జైలు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్ పై విడుదలయ్యాడు. దీంతో సదరు బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్​ను అడగగా కేసు పెట్టావు, జైలు శిక్ష అనుభవించి వచ్చాను, నేను పెళ్లి చేసుకోనని చెప్పాడు. దాంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసివచ్చి తాళం వేసి ఉన్న ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. మోసం చేసిన ప్రశాంత్ తనని పెళ్లి చేసుకోవాలని, సచ్చినా బతికినా వాడితోనేనని ప్రియురాలు భీష్మించుకుని కూర్చుంది. సుమారు గంటపాటు ప్రియుడి ఇంటిముందు బైఠాయించి నిరసన తెలియజేయడంతో స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిరసనకు దిగిన అమ్మాయి తో పాటు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఆందోళన విరమించేలా చేశారు.

Advertisement

Next Story

Most Viewed