కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు సమచిత స్థానం కల్పించింది

by Sridhar Babu |
కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు సమచిత స్థానం కల్పించింది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు సమచిత స్థానం కల్పించిందని, రాబోయే రోజుల్లో మీ సమస్యలను నెరవేరుస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్​ అలీ అన్నారు. మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మున్నూరు కాపు సంఘం సభ్యులతో మహమ్మద్ షబ్బీర్ అలీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డి. శ్రీనివాస్ తో తన సంబంధం అన్నదమ్ముల అనుబంధం అన్నారు. డి.శ్రీనివాస్ మున్నూరు కాపుల సంక్షేమం కోసం పరితపించే వారన్నారు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసిందని అన్నారు.

నిజామాబాద్ పట్టణంలో మున్నూరు కాపులు నిజామాబాద్ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు, యువతకు ఉరితాళ్లు మిగుల్చుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ ప్రకటించిన ఆరు పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెలా మహిళలకు రూ. 2500 అందిస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, గృహ జ్యోతి ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. తెలంగాణలో దొరలపాలనను సాగనంపి, ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Next Story