విందులో అధికార పార్టీ నాయకుల బాహా బాహి

by Sridhar Babu |
విందులో అధికార పార్టీ  నాయకుల బాహా బాహి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అధికార పార్టీకి చెందిన అర్మూర్ బల్ధియా కౌన్సిలర్ భర్త, మరో కౌన్సిలర్ బీరు సీసాలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాట్లను చర్చించడానికి ఒక ఫంక్షన్ హాల్ లో మంగళవారం రాత్రి సమావేశం అయ్యారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలో మాట మాట పెరిగి వ్యక్తిగత దూషణలకు దారి తీసింది. ఓ కౌన్సిలర్ భర్త, మరో కౌన్సిలర్ మద్యం మత్తులో ఒకరిపై ఒకరు సీసాలతో దాడి చేసుకున్నారు, ఈ సంఘటనలో ఒక శాఖలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగితో పాటు ఒక పాత్రికేయునికి గాయాలైనట్లు తెలిసింది. ఒకరిపై ఒకరు వ్యక్తి గత దూషణలు చేసుకోవడంతో చిలికి చిలికి గాలి వానగా గొడవకు దారి తీసినట్లు తెలిసింది.

గొడవ జరుగుతున్న సమయంలో ప్రజా ప్రతినిధులు అక్కడే ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఓ సామాజికవర్గం వారి అత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే హాజరు పై చర్చించుకోవడానికి వచ్చి దాడులు చేసుకోవడం ఏంటని పార్టీ లో చర్చ జరుగుతుంది. గత వారం అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇరువురి మధ్య వ్యక్తిగత దూషణలతో దాడి చేసుకున్నట్లు సమాచారం. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒక నేత తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పదేపదే గొడవలు జరగుతుండటంతో ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అధికార పార్టీ నాయకులు ఎన్నికల వేళ జరుగుతున్న విందులు పార్టీకి చేటు తెచ్చేలా ఉన్నాయి. విందులో మద్యం మత్తులో ఒకరిపై మరొకరు చిందులు వేసుకుంటూ పరస్పర దాడులు చేసుకోవడంతో పార్టీకి మచ్చ తేవడమే కాకుండా ప్రజల్లో నగుబాటుకు గురవుతున్నామని సొంత పార్టీ నాయకులు చెబుతున్నారు.

Next Story