హత్య చేశారు...ప్రమాదంగా చిత్రీకరించారు...

by Sridhar Babu |
హత్య చేశారు...ప్రమాదంగా చిత్రీకరించారు...
X

దిశ,నిజాంసాగర్ : ఆస్తి కోసం అల్లుడి చేతిలో సొంత మామ హతమయ్యాడు. ఈ మేరకు బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహమ్మద్ నగర్ మండలంలోని బుర్గుల్ గ్రామానికి చెందిన గుట్ట మీది చాకలి పోచయ్య (58) ను ఆస్తి కోసం సొంత అల్లుడు గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి హత్య చేశాడు. బుర్గుల్ గ్రామానికి చెందిన చాకలి పోశయ్య భార్య లక్ష్మి పది సంవత్సరాల కిందటే మృతి చెందింది. వీరికి కుమార్తె సుజాత ఉన్నారు. భార్య మృతి చెందిన తర్వాత పోశయ్య మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఇటు బుర్గుల్ లో,అటు మహమ్మద్ నగర్ గ్రామంలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాడు.

ఐదారు సంవత్సరాల కిందట కుమార్తె సుజాత, అదే గ్రామానికి చెందిన నడిమింటి శ్రీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పోశయ్యకు గ్రామంలో మూడెకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. బుధవారం రాత్రి పోశయ్య గ్రామంలో ఓ వివాహ వేడుకల్లో పాల్గొని రాత్రి పది గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై బూర్గుల్ నుంచి మహమ్మద్ నగర్ కు వెళ్లిపోయాడు. గురువారం ఉదయం చూసే సరికి పోశయ్య ద్విచక్ర వాహనం ప్రధాన కాలువ పై ఉన్న వంతెనపై వేలాడుతూ కనిపించింది. పోశయ్య మృతదేహం గాలిపూర్ గ్రామ శివారులో ప్రధాన కాలువలో నీటిలో కొట్టుకుపోతూ ఉండగా అప్పుడే తండా వాసులు ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా చూశారు. దాంతో కూలీలు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.

ఒంటి నిండా గాయాలు, రక్తంతో ఉండడంతో వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ , పిట్లం ఎస్సై నీరేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి కోసమే మామను అల్లుడు నడిమింటి శ్రీకాంత్ తో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు షేక్ మహబూబ్, నడిమింటి రాములు కలిసి ప్రధాన కాలువ వద్ద గల వంతెన సమీపంలో చంపివేసి నీటిలో తోసేసి ద్విచక్ర వాహనాన్ని వేలాడదీసి ప్రమాదం జరిగినట్టుగా చిత్రీకరించారని, దీనిని లోతుగా విచారణ జరిపి నిందితులను గుర్తించామన్నారు. మృతుడి మేనమామ పెద్ద దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ సీఐ తెలిపారు.

Advertisement

Next Story