మెట్రో ఫేజ్ 2లో మార్పులు చేయండి : కిషన్ రెడ్డికి వినతి

by M.Rajitha |
మెట్రో ఫేజ్ 2లో మార్పులు చేయండి : కిషన్ రెడ్డికి వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి సంబంధించి కారిడార్ 4, కారిడార్ 9లో మార్పులు చేయాలని, తద్వారా 76 కిలోమీటర్ల దూరాన్ని 41 కిలోమీటర్లకు తగ్గించవచ్చని బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు యాదవ్ తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దీనికి సంబంధించిన వివరాలను అందజేశారు. ఇటీవల మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మెట్రో రైల్ ఫేజ్ 2కి సంబంధించిన కొత్త కారిడార్లను ప్రకటించారని, అందులో కారిడార్ 4 అయిన విమానాశ్రయ మెట్రో కారిడార్ రూట్ మ్యాప్ ను విడుదల చేశారని తెలిపారు. ఈ రూట్ మ్యాప్ నాగోల్ నుంచి ప్రారంభమై ఎల్బీ నగర్, మందమల్లమ్మ, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 36 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొన్నారు. కారిడార్ 9 శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు 40 కిలోమీటర్లు అనగా 4, 9 కారిడార్లు కలిపి 76 కిలోమీటర్లుగా ప్రకటించారన్నారు. అయితే కారిడార్ 4, 9 రూటును నాగోల్, ఎల్బీనగర్, మందమల్లమ్మ, బాలాపూర్ చౌరస్తా, శివాజీ చౌక్, ఆర్‌సీఐ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం, మహేశ్వరం గేట్, కందుకూర్ ఫోర్త్ సిటీ రూట్ కు మారిస్తే 76 కిలోమీటర్ల మెట్రో లైన్ కేవలం 41 కిలోమీటర్లతోనే పూర్తి చేయవచ్చని శ్రీరాములు యాదవ్ కిషన్ రెడ్డికి వివరించారు. కాగా దీనిపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఈ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీని కలిసి అందజేస్తానని శ్రీరాములు యాదవ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed