అంధుల జీవితాల్లో విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ

by Sridhar Babu |
అంధుల జీవితాల్లో విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ
X

దిశ, కామారెడ్డి : అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహనీయుడు, విద్యావేత్త లూయిస్ బ్రెయిలీ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలను గురువారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అంధులు ఆత్మవిశ్వాసంతో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని కోరారు.

అంధులు అధైర్య పడవద్దని, బ్రెయిలీ లిపి ద్వారా చదువు నేర్చుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలన్నారు. ప్రజా పాలన దరఖాస్తులను అధికారులు దివ్యాంగుల ఇంటి వద్దకు వెళ్లి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దివ్యాంగులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఇంకా కావలసిన సౌకర్యాలను కల్పించుటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంధుల కోసం

ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పై బ్రెయిలీ లిపిని రాయించినట్లు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి బ్రెయిలీ లిపి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, జాతీయ అంధుల సంఘం అధ్యక్షుడు హరి సింగ్, భవిత కో ఆర్డినేటర్ శ్రీపతి, సుదర ఫౌండేషన్ ప్రతినిధి సుజాత రెడ్డి, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పోశవ్వ, భిక్ష నాయక్, రవీందర్, దుర్గాప్రసాద్, ఐసీడీఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story