పోలీసులు గులాంగిరి చేయడం సిగ్గు చేటు

by Sridhar Babu |
పోలీసులు గులాంగిరి చేయడం సిగ్గు చేటు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాజకీయాలతో సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తితో ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీ నాయకులకు గులాంగిరి చేయడం సిగ్గు చేటని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న సీఐల బదిలీ ఉత్తర్వులు ఆగిపోవడంపై నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. నగరంలో కొందరి సీఐల పై ఎన్నో అభియోగాలు వస్తున్నా ఏళ్ల తరబడి అదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఆరోపణలు వస్తున్న అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఐల బదిలీ ఉత్తర్వులు ఇచ్చి మళ్లీ ఆపడంపై మతలబ్ ఏంటో కమిషనర్, ఐజీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో కొందరు ఖాకీలు గులాబీ కండువా వేసుకున్న కార్యకర్తల్లాగా పని చేసి, ప్రభుత్వం మారగానే వారు కూడా పార్టీ ఫిరాయించినట్లు కాంగ్రెస్ నేతలకు గులాంగిరీ చేస్తున్నారని అన్నారు. పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని కొందరు అధికారుల కారణంగా మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, సామాన్యులకు న్యాయం చేసే అంశాలపై కాకుండా రాజకీయ నాయకులకు గులాంగిరి చేస్తానంటే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Next Story

Most Viewed