నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. తెరుచుకొనున్న గేట్లు

by Mahesh |
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. తెరుచుకొనున్న గేట్లు
X

దిశ, నిజాంసాగర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్(Nizamsagar project)కు జలకళ సంతరించుకుంది. భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 18,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారి ఈఈ సోలోమాన్ తెలిపారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు గాను ప్రస్తుతం 1403.21 అడుగుల నీరు నిల్వ ఉంది. అదే విధంగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు కాగా ప్రస్తుతం 15.268 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో నుంచి హల్దీ వాగు(Haldi Vagu), పోచారం ప్రాజెక్టు(Pocharam Project) పొంగి ప్రవహిస్తుండటంతో నీరు ఉధృతంగా వచ్చి నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి చేరుతుంది. మరికొద్ది గంటల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుంటుందని ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువ మంజీరా నదిలోని నీటిని వదలనున్నట్లు ఆయన తెలిపారు.

అదే విధంగా భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు కూడా వరద నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, గొర్రెల కాపరులు, ఎవరు కూడా మంజీరా నది(Manjir River)ప్రాంతంలో, నీటి ప్రవాహంలోకి, కాల్వలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం సాయంత్రంలోగా నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను తెరవనున్న సందర్భంగా బాన్సువాడ డీఎస్‌పీ(DSP) సత్యనారాయణ, రూరల్ సీఐ సత్యనారాయణ స్థానిక నీటిపారుదల శాఖ ఈఈ సోలో మాన్‌తో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాజెక్టు పైకి వచ్చే పర్యాటకులకు ఉధృతంగా ప్రవహించే నీళ్ల వద్దకు వెళ్లోద్దని ఎస్సై సుధాకర్‌ సూచించారు. ప్రాజెక్టు గేట్లు వదులుతున్న సందర్భంగా దిగువన మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed