ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి

by Disha Web Desk 15 |
ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి
X

దిశ, కామారెడ్డి : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ (2023-24) ధాన్యం కొనుగోళ్లపై జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన

నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలను అధికారులు, ఆయా శాఖల బాధ్యులు మాత్రమే ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ప్రజా ప్రతినిధులను ఆహ్వానించరాదని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్లు, తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. నిర్దేశించిన బరువుకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.

మద్దతు ధరకే విక్రయించాలి

రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పిలుపు నిచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2203, గ్రేడ్ బీ రకానికి రూ.2183 నిర్ణయించినట్లు వెల్లడించారు. నిబంధనల మేరకు రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని సూచించారు.

ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం

రబీ సీజన్ కోతలు మొదలైన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఏప్రిల్ 1 వ తేదీ లోగా ఒక్కో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో ఈ రబీ సీజన్లో దాదాపు 4.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని వెల్లడించారు. ధాన్యాన్ని సేకరించేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 326, ఐకేపీ ఆధ్వర్యంలో 22 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వివరించారు.

ఏప్రిల్ 15వ తేదీ వరకు అన్ని కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అవసరం అయితే ఇంకా కేంద్రాలు ఎక్కువ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రైతులకు టోకెన్లు ఇవ్వాలని, దాని ప్రకారం కొనుగోళ్లు చేయాలని సూచించారు. ఈ సారి ఐరిస్ యంత్రాలు కూడా పంపిస్తామని, ధాన్యం కొనుగోలు చేసినప్పుడు రైతు ఐరిస్ కూడా తీసుకోవాలని సూచించారు. ఆయా కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు కొనుగోళ్లు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు.

పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి

జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వెల్లడించారు. టార్పాలిన్లు, తూకం వేసే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం చూసే మెషిన్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో డీసీఎస్ఓ మల్లికార్జున బాబు, జిల్లా మేనేజర్ నిత్యానంద్, జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఐకేపీ డీపీఎం రమేష్ బాబు, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల లింగం, వ్యవసాయ అధికారులు, సహకార సంఘాల సీఈవోలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed