200 యూనిట్లలోపు కరెంటు బిల్లు కట్టకండి

by Sridhar Babu |
200 యూనిట్లలోపు కరెంటు బిల్లు కట్టకండి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించినందున వినియోగదారులు బిల్లు కట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రకటనే కాబట్టి ప్రజలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ ఫిలిప్ సుజ దంపతుల ఆహ్వానం మేరకు వారి నివాసంలో కవిత క్రిస్మస్ విందుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ....సంక్షేమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, ఈ క్రమంలో రెండు మూడు అంశాలపై ప్రజలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, వారికి ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండా రూ. 2 వేల పెన్షన్ ను రూ. 4 వేలకు పెంచే అవకాశం ఉన్నప్పటికీ పెంచకుండా మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలు లైన్లు కట్టే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. మళ్లీ దరఖాస్తులు కోరడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పెన్షన్ అందుకుంటున్న 44 లక్షల మందికి జనవరి 1 నుంచి రూ. 4 వేలకు పెంచి పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరికీ పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని అన్నారు. రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో ఇంకా ఎందుకు జమ చేయలేదన్న చర్చ గ్రామాల్లో జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించారు. రూ. 4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదన్నారు. ఓట్ల శాతంలో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ కు పెద్ద తేడా లేదని, కేవలం 2 శాతం ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed