కౌంటింగ్ సెంటర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ

by Sridhar Babu |
కౌంటింగ్ సెంటర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా గుర్తించిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు, వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన మార్పులు, చేర్పులు యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, విద్యుత్, కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు, ఇతర అన్ని ఏర్పాట్లను చక్కబెట్టాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, అభ్యర్థులు, ఏజెంట్లకు రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాల్ లలో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని, అగ్ని ప్రమాదాలు వంటి వాటికి ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని చోట్ల విద్యుత్ వసతి, ఫ్యాన్లు, లైట్లు పని చేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్, తదనంతరం చేపట్టే కౌంటింగ్ ప్రక్రియలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, అదనపు డీసీపీ జయరాం, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ బి.నరేష్, శ్రీరాంకుమార్, ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు.

Next Story