కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పునాది.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

by Sumithra |
కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పునాది.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, భిక్కనూరు : పార్టీకి బలం బలగం గట్టి పునాది కార్యకర్తలేనని, వారు కష్టపడి పని చేయడం వల్లే మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ చీఫ్ గా తొలిసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయనకు జిల్లా ముఖద్వారం అయిన భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనను పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టిందంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.

పార్టీని నమ్ముకొని పని చేసిన నాయకులకు కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా కష్టపడ్డారో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేసి 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను పక్కనపెట్టి పెత్తందారులైన ఆదాని, అంబానీలకు దేశసొత్తును దోచిపెడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నప్పటికీ ఇది చూడలేని ప్రతిపక్షాలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, ఉమ్మడి జిల్లాల నాయకుల మనమంతా ఒక్కటేనన్నారు.

Next Story

Most Viewed