సాగర్ గేట్లు 26 ఓపెన్.. జన సాగరం కృష్ణాతీరం..

by Nagam Mallesh |
సాగర్ గేట్లు 26 ఓపెన్.. జన సాగరం కృష్ణాతీరం..
X

దిశ, నాగార్జునసాగర్‌: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ పర్యాటకులతో కిక్కిరిసింది. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేయడం తో పర్యాటకుల రాకపోకలు మరింత పెరిగాయి. విద్యాసంస్థలకు సెలవు కావడంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సాగర్‌ డ్యాంకు తరలివచ్చారు. సాగర్ గేట్ల నుండి నీరు జాలువారుతుండగా, ఈ అందాలను వీక్షిస్తూ పర్యాటకులు మైమరచిపోయారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నాగార్జునసాగర్ డ్యామ్ సమాచారం నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 586.80 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 304.4680 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 28,582 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 6253 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వద్వారా నీటి విడుదల లేదు, ఎస్.ఎల్.బి.సి ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని, లోలేవల్ కెనాల్ ద్వారా 600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుండి వచ్చిన నీటిని వచ్చినట్లు మొత్తం 5,40,503 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎన్నో ఆశలతో ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‎కు వచ్చిన పర్యాటకులకు మాత్రం నిరాశ ఎదురైంది. నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారి కొత్త అందాలను సంతరించుకుంది. వారం రోజులుగా ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో కృష్ణమ్మ పరవళ్ళను చూసేందుకు పర్యాటకులు నాగార్జునసాగర్‎కు తరలివస్తున్నారు. సాగర్ వద్దకు వచ్చిన ప్రతి పర్యాటకుడు కృష్ణమ్మ అలల పై లాంచీ ప్రయాణం చేసి మధురమైన అనుభూతి పొందుతుంటారు. నాగార్జునసాగర్ నుంచి నాగార్జున కొండకు పర్యాటకులను తీసుకువెళ్లే తెలంగాణ టూరిజం శాఖ లాంచీలను నిలిపి వేసింది. దీంతో సాగర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు నాగార్జున కొండను సందర్శించే అవకాశం లేకుండా పోయింది.

ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు

నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఎగువన శ్రీశైలం నుంచి వరద ఉధృతంగా ప్రవహించడంతో సాగర్‌ నిండుకుండలా మారి ఆనందాన్ని పంచుతోంది. నీటి ప్రకృతి అందాలను తిలకించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా వాహనాలే దర్శనమిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్ల సుందర దృశ్యాలు నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో నీటి దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. డ్యామ్ పరిసరాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. సాగర్ అందాలను పర్యాటకులు సెల్ ఫోన్ లో బంధిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed