సూర్యాపేటలో ఎటువంటి కూల్చివేతలు ఉండవు: పటేల్ రమేష్ రెడ్డి

by Mahesh |
సూర్యాపేటలో ఎటువంటి కూల్చివేతలు ఉండవు: పటేల్ రమేష్ రెడ్డి
X

దిశ, సూర్యాపేట : సూర్యాపేట పట్టణ కేంద్రంలో ఎటువంటి కూల్చివేతలు ఉండవని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల ఇళ్లు కూల్చివేత జరగదని అన్నారు. సూర్యాపేటకు హైడ్రా తో సంబంధం లేదని, హైడ్రా కేవలం ఓఆర్ఆర్ లోపల మాత్రమే హైడ్రా పనిచేస్తుందన్నారు. జిల్లాలతో హైడ్రాకు సంబంధం లేదని, సూర్యాపేటలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌ల సర్వే చేయమని ప్రభుత్వం నుండి ఆదేశాలు లేవని అన్నారు.బిఆర్ఎస్ నాయకులు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించి,భయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని,ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

భవిష్యత్తులో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కాలనీలు మునిగి పోకుండా ఉండడానికి హైడ్రా చెరువుల పరిరక్షణ కార్యక్రమం చేపట్టిందని అన్నారు.జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు, పుల్లారెడ్డి చెరువులకు ఇప్పటికే చెరువు కట్టల నిర్మాణం జరిగిందని,చెరువు కట్టల బయట జరిగిన నిర్మాణాలు కూల్చడం జరగదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నారని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డుల మంజూరు చేస్తామని చెప్పారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం డబల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తుందన్నారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిని 1000 పడకల ఆసుపత్రిగా మారుస్తామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత సద్దల చెరువు సుందరీకరణ, పార్క్‌ల నిర్మాణం కోసం రూ.10 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఉర్లుగొండ దేవాలయ అభివృద్ధి కోసం రూ.౩ కోట్లు,పిల్లలమర్రి శివాలయం అభివృద్ధి కోసం రూ.2.5 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed