మరి కొన్ని గంటల్లో కౌంటింగ్.. బీజేపీ ఏజెంట్లకు MP లక్ష్మణ్ కీలక సూచన

by Satheesh |
మరి కొన్ని గంటల్లో కౌంటింగ్.. బీజేపీ ఏజెంట్లకు MP లక్ష్మణ్ కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఎవరి భవితవ్యం ఏంటనేది మంగళవారం తేలనుంది. అభ్యర్థులంతా ఎవరికి వారుగా గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సాధించడం తథ్యమని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద శ్రేణులు వ్యవహరించాల్సిన తీరుపై రాజ్యసభ సభ్యుడు దిశానిర్దేశం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సెంటర్ల వద్ద అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగానే లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

అక్కడ ఏం జరిగినా వార్ రూమ్‌కు సమాచారం అందించాలని ఆయన స్పష్టంచేశారు. అంతేకాకుండా బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అందుకు అనుగుణంగా ఎవరు ఏం మాట్లాడాలన్న అంశంపై రాష్ట్ర అధికార ప్రతినిధులకు లక్ష్మణ్ దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టాలని, డిబేట్లలో పాల్గొనాలని స్పోక్స్ పర్సన్లకు సూచించారు. ఇదిలా ఉండగా మంగళవారం కౌంటింగ్ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం 7 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు.



Next Story