MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు

by Shiva |   ( Updated:2024-08-27 15:44:18.0  )
MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉత్కంఠకు తెర పడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు కవిత తరఫున ప్రముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించగా.. ఈడీ తరఫున ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు.

ఈడీ, సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లపై ఇప్పటికే విచారణ పూర్తైందని అన్నారు. ఈ కేసులో రూ.100 కోట్లు చేతులు మారాయనడం కేవలం ఆరోపణలేనని ధర్మాసనానికి వివరించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని ఈడీ, సీబీఐ కేసులో ఆమె గత 5 నెలలుగా (153 రోజులుగా) జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 493 మంది సాక్షుల విచారణ కూడా ముగిసాయని కేసులో ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశమే లేదన్నారు. ఈడీ నుంచి నోటీసులు రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు ప్రశ్నించగా.. అందుకు రోహత్గీ సమాధానమిస్తూ.. ప్రజలు ఎవరైనా ఫోన్లు, కార్లు మార్చండం మారుస్తూ ఉండటం సహజమని అన్నారు.

అందుకు ధర్మాసనం ప్రతిరోజూ ఫోన్లు మార్చడం ఏంటని ప్రశ్నించింది. అనంతరం ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు తన వాదనలు వినిపిస్తూ.. ఈడీ నోటీసులు అందగానే అన్ని ఫోన్లను కవిత ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు. కేవలం 10 రోజల డేటా మాత్రమే రికవరీ చేశారని గుర్తుచేశారు. ఫోన్లను అన్నింటిని ఫార్మాట్ చేసి ఇంట్లో పని చేసే వారికి ఇచ్చారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో కవిత ఎలా బెయిల్ ఇస్తారని ఈడీ లాయర్ ఎస్వీ రాజు వాదించారు. కేసులో మొత్తం సాక్ష్యాలను తారుమారు చేశారని పేర్కొన్నారు.

అదేవిధంగా విచారణ సమయంలోనూ కవిత తమకు సహకరించలేదని ఈడీ ధర్మాసనానికి తెలిపింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన అంశాలను ఈడీ కోర్టుకు వివరిస్తూ.. కేసులో అరుణ్‌ పిళ్లై డమ్మిగా మాత్రమే ఉన్నారని.. అసలు వాటాదారు కవితే అని మరికొందరితో కలిసి రూ.100 కోట్లను ముడుపుల రూపంలో చెల్లించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. పిళ్లై వెనక్కి తీసుకున్న వాంగ్మూలాన్ని పక్కన పెట్టామని.. అంతకు ముందుకు ఇచ్చిన వాంగ్మూలాలనే పరిగణలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వెల్లడించింది. ఈ క్రమంలో కవిత తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ కలుగజేసుకుని.. కేసులో నిందితులంతా అప్రూవర్లుగా మారిపోయారని కోర్టుకు తెలిపారు. ఒక్కొక్కరు ఐదు చొప్పున స్టేట్‌మెంట్లు ఇచ్చారని. అప్రూవర్లుగా మారి బెయిల్ పొందుతున్నారని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందని ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి వివరించారు. ఇరు పక్షాల వాదనలు సుధీర్ఘంగా విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

Next Story

Most Viewed