Ponguleti: నాడు పట్టించుకున్న పాపానపోయారా.. బీఆర్ఎస్ పై పొంగులేటి ఫైర్

by Prasad Jukanti |   ( Updated:2024-10-11 08:32:14.0  )
Ponguleti:  నాడు పట్టించుకున్న పాపానపోయారా.. బీఆర్ఎస్ పై పొంగులేటి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పేదల ఆకాంక్షలు నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొన్నెకల్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న అంతరాలను తగ్గించేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న గురుకులాలన్నీ ప్రైవేటు భవనాల్లోనే ఉన్నాయని చెప్పారు. పేదవారి బతుకులు మార్చేందుకు విద్య, వైద్యం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు.

గత ప్రభుత్వం భయభ్రాంతులకు గురైంది..

ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు గత ప్రభుత్వం భర్తీ చేయలేక పోయిందని మంత్రి విమర్శించారు. దీంతో టీచర్లు లేక విద్యార్థులు సర్కార్ బడులకు దూరం అవుతున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో టెట్ నిర్వహించడంతోపాటు మెగా డీఎస్సీ ద్వారా 10 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసిందని పొంగులేటి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల విషయంలోనూ భయభ్రాంతులకు గురైందని అందువల్లే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టేలేకపోయిందన్నారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుమారు 34 వేల టీచర్ల ట్రాన్స్‌ఫర్లు, 24 వేల మంది టీచర్లకు పారదర్శకంగా ప్రమోషన్లు కల్పించామన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొక్కుబడిగా గురుకుల పాఠశాలలు పెట్టినా అవన్నీ ప్రైవేట్ భవనాల్లోనే ఉన్నాయన్నారు. కానీ తాము ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందించేలా కుల, మత వర్గ అంతరాలు లేకుండా ఇంటిగ్రేడెట్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. మొదటి విడతగా 28 చోట్ల వీటికి శంకుస్థాపన చేస్తున్నామని, త్వరలో అన్ని నియోజకవర్గాలకు ఈ కాంప్లెక్స్‌లు రాబోతున్నాయన్నారు.

ప్రతి వ్యక్తి నెత్తిమీద రూ. లక్ష 80 వేల అప్పు..

గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి నెత్తిమీద రూ. లక్ష 80 వేల అప్పును మోపిందని పొంగులేటి వెల్లడించారు. ఇంతటి ఇబ్బందులు ఉన్నా తాము సంక్షేమం ఆపడం లేదన్నారు. గత పాలకులు తమ స్వార్థం కోసం అనేక ప్రాజెక్టులు మొదలు పెట్టి మధ్యలోనే ఆపేస్తే తాము వచ్చా వాటిని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నామన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు ఫోర్త్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారన్నారు. ప్రైవేటుకు దీటుగా పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Advertisement

Next Story