విద్యార్థులు ఫుల్.. ఉపాధ్యాయులు నిల్..

by Aamani |   ( Updated:2024-09-24 11:06:23.0  )
విద్యార్థులు ఫుల్.. ఉపాధ్యాయులు నిల్..
X

దిశ,ఉప్పల్ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెప్పే పాలకుల మాటలు నీటి మూటలు గానే మిగిలిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాటలే తప్ప కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలున్నాయి. తద్వారా విద్యార్థులు అసౌకర్యాల మధ్య పాఠాలు వింటున్నారు.ప్రతి ఏటా బడిబాట ద్వారా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకుంటూన్నారే తప్ప వారికి సౌకర్యాలు కల్పించడానికి ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.మేడ్చల్ జిల్లా చిల్కానగర్ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో అసౌకర్యాల నడుమ విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి పై దిశ మంగళవారం స్పెషల్ ఫోకస్ చేసింది.

విద్యార్థులు ఫుల్.....ఉపాధ్యాయులు నిల్

విద్యార్థుల సంఖ్య.. ప్రైవేట్ పాఠశాలలు పోటీపడి విద్యార్థులను చేర్చుకుంటున్న నేటి తరుణంలో చిల్కానగర్ హైస్కూల్లో మాత్రం విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు 260 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.వీరిని తెలుగు, ఇంగ్లీష్ మీడియాలుగా విభజించారు. కానీ ఉపాధ్యాయుల కొరత మాత్రం పట్టిపీడిస్తోంది.260 మంది విద్యార్థులకు కనీసం 9 మంది ఉపాధ్యాయులు,1పీఈటీ టీచర్ ఉండాలి.ప్రస్తుతం ఒకరు ప్రధానోపాధ్యాయులు,ముగ్గురు ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నారు. ఇంగ్లీష్,ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక సరైన విద్యాబోధన జరగడం లేదని విద్యార్థులు బాధ వెళ్లబుచ్చుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్,డీఈఓ స్పందించి మాకు ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు.

విద్యార్థులకు సరిపడలేని గదులు..

విద్యార్థుల సంఖ్యకనుగుణంగా తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో బయట కూర్చుని పాఠాలు వినవలసి వస్తుందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.తరగతి గదులు సరిపోక షెడ్డులో విద్యా బోధన చెప్తున్నారు.విద్యార్థులకు సరిపడే తరగతి గదులను కేటాయించాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.

బాత్‌రూమ్‌‌ల కొరత..

తరగతి గదుల తో పాటు బాత్రూంలు సరిపడా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.260 మంది విద్యార్థులకు 2 బాత్రూమ్ లు ఉన్నాయి.కాంట్రాక్టర్ కొత్తగా మూడు బాత్రూంలో కట్టి నిధులు మంజూరు కాలేదని మధ్యలో పని ఆపేశాడు.అవి విద్యార్థులకు ఉపయోగకరంగా లేకుండా పోయాయి. సరైన విద్యాబోధన లేక,కనీస వసతులు లేక అగమ్యగోచరంగా పరిస్థితులు ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు.

బీజేపీ చిలకనగర్ డివిజన్ అధ్యక్షుడు గోనే శ్రీకాంత్ మాట్లడుతూ.. చిలకనగర్ డివిజన్ మండల ప్రాథమిక హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరత తో పాటు మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటమాడుతుందని ద్వజమెత్తారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంఈఓ ని కలిసి సమస్యలు వివరించి వినతిపత్రం అందజేశామన్నారు. ఎంఈఓ వెంటనే స్పందించి త్వరలోనే ఖాళీగా ఉన్న సబ్జెక్టులకు ఉపాధ్యాయులను కేటాయిస్తామని అన్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed