రూ. వందల కోట్ల విలువైన స్థలం స్వాహా..! కన్నేశారు.. కాజేస్తున్నారు?

by Shiva |
రూ. వందల కోట్ల విలువైన స్థలం స్వాహా..! కన్నేశారు.. కాజేస్తున్నారు?
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు నిర్మాణాలు వెలుస్తాయి. అనుమతులతో ఎలాంటి పని లేదు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు, అడిగే దిక్కే లేదు. కబ్జా చేయడం, భవనాలు నిర్మించడం, ఇదే కదా భూ కబ్జాదారుల సూత్రం. మేడ్చల్ జిల్లాలోని ఆల్వాల్ మండలంలోని జొన్నబండలో దాదాపు 55 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇదే జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధుల అండతో భూ అక్రమణదారులు ఇలాంటి దందాకు రంగంలోకి దిగారనే ప్రచారం జరుగుతోంది.

ఖరీదైన స్థలం హాంపట్..

మేడ్చల్ మల్కాజ్‌గిరి జల్లా ఆల్వాల్‌లో సర్వే నంబర్ 582, 583‌లలో రూ.కోట్ల విలువ చేసే సుమారు 55 ఎకరాల భూమి ఉంది. అది అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడ గజం భూమి ధర రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు పలుకుతోంది. ఇంతటి ఖరీదైన స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. ఇంకేముంది తప్పుడు పత్రాలు సృష్టించి లే‌అవుట్ పేరిట ప్లాట్లుగా విక్రయించి సోమ్ము చేసుకున్నారు. భూ ఆక్రమణదారులకు కొందరు ప్రజా‌ప్రతినిధులు తోడయ్యారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ అప్పనంగా కొన్ని ప్లాట్లు కొట్టేశారని టాక్. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసిన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికార యంత్రాంగం చర్యలకు వెనుకాడిందని తెలిసింది. దీంతో రూ.వందల కోట్ల విలువైన సర్కారీ స్థలం హారతి కార్పురంలా కరిగిపోతోంది.

కోర్టు ఆదేశించినా..

ఆల్వాల్‌లో సర్వే నంబర్ 582, 583 లలో కబ్జాకు గురైన స్థలంపై విచారణ చేపట్టాలని హైకోర్టు మేడ్చల్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. విచారణలో అది ప్రభుత్వ భూమి అని తేలితే ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని 2023, నవంబర్ 21న కోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. కాగా, 55 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ 2020లో న్యాయవాది కే.విజయ్ కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణకు పిటిషనర్ కూడా హాజరు కాలేదు. ప్రైవేట్ వ్యక్తి ఎం.జనార్దన్ తరపు న్యాయవాది

ఆ భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పినప్పటికీ విక్రయ దస్తావేజు తేదీల వివరాలను వెల్లడించ లేదు. ప్రత్యేక పరిస్థితులు ఉన్న ఈ వ్యవహరంలో పిటిషనర్‌తో పాటు భూమిపై హక్కులు ఉన్నాయంటున్న వారందరికీ నోటీసులు జారీ చేయాలని కోర్టు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. భూమిపై హక్కులకు సంబంధించి తగిన పత్రాలను సమర్పించడానికి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అని తేలితే ఆక్రమణదారుల తొలగింపునకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని గడువు విదించింది. కోర్టు ఆదేశాలు జారీ చేసి 10 నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటికి ఆ స్థలంలో కబ్జాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed