Collector : పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

by Kalyani |
Collector : పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
X

దిశ, సంగారెడ్డి : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగం మరువలేనిదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. సోమవారం పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్మృతి పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ… పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని, ఆనాటి వారి ప్రాణత్యాగాల వలననే నేడు మనందరం సుఖ:సంతోషాలతో ఉండగలుగుతున్నామన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా పోలీసు శాఖ ఎదురు నిలబడి, పోరాడటం జరుగుతుందని, అలాంటి పోలీసుల సేవలు మనందరి మదిలో చిరస్మరణీయన్నారు. గడిచిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం లో పోలీసుల పాత్ర కీలకం అన్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ… విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబరు 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (పోలీస్ ఫ్లాగ్ డే) గా నిర్వహిస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు వీర జవాన్లు వివిధ సంఘటనలలో నక్సల్స్, సంఘవిద్రోహ శక్తుల దుశ్చర్యలకు బలి అయ్యారన్నారు. ఇందులో సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎల్లయ్య, జిన్నారం పోలీస్ స్టేషన్ కు చెందిన సత్యనారాయణ, కంగ్టి పోలీస్ స్టేషన్ కు చెందిన సురేష్ విధి నిర్వహణలో ప్రాణాలర్పించి వీరమరణం పొందారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నానన్నారు.

అనంతరం పోలీస్ అమరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, జహీరాబాద్ డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి, పటాన్ చెర్వు డీఎస్పీ రవీందర్ రెడ్డి, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఎఆర్.డీఎస్పీ నరేందర్, యస్.బి. ఇన్స్పెక్టర్స్ విజయ్ కృష్ణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, జిల్లా ఇన్స్పెక్టర్స్, ఆర్.ఐ.లు రామరావ్, రాజశేఖర్, పరేడ్ కమాండర్ డానియెల్, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed