వన దుర్గమ్మ చెంత తగ్గిన గంగమ్మ ఉధృతి..

by Sumithra |
వన దుర్గమ్మ చెంత తగ్గిన గంగమ్మ ఉధృతి..
X

దిశ, పాపన్నపేట : దేశంలోనే రెండో వన దుర్గామాత ఆలయం, జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ముందు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. 9 రోజులుగా వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నసంగతి తెలిసిందే. సోమవారం వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఆలయాన్ని కొంతమేర శుభ్రం చేశారు. మంగళవారానికి వరద ఉధృతి తగ్గితే వన దుర్గమ్మ దర్శనం పునరుద్ధరిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలకు 30 శతకోటి ఘనపుటడుగుల ఆనకట్ట నిండడంతో పాటు సింగూరు నుంచి దిగువకు నీటిని వదలడంతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద వస్తుండడంతో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది.

పటాన్ చెరువు సమీపంలోని నక్కవాగు నీరు కూడా చేరడంతో మంజీరాలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి నీరు దిగువకు ప్రవహిస్తుంది. ప్రాజెక్టు పై నుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ఆలయం ముందున్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేసింది. ఆలయ అధికారులు, అర్చకులు వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తు భక్తులకు వనదుర్గామాత దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఏడుపాయలకు విచ్చేసిన భక్తులు రాజగోపురంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed