‘మూసీకి మల్లన్న సాగర్‌కు ముడిపెట్టి రాజకీయాలు చేస్తున్నారా..?’

by Aamani |
‘మూసీకి మల్లన్న సాగర్‌కు ముడిపెట్టి రాజకీయాలు చేస్తున్నారా..?’
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి తీరుపై మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...మూసీకి మల్లన్న సాగర్ కు ముడిపెట్టి రాజకీయాలు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న బిడ్డల్లా చూసుకుంటామని కల్ల బొల్లి మాటలతో భూములు లాక్కొని బతుకులను ఆగం చేసింది బీఆర్ఎస్ నాయకులు కాదా అని అన్నారు. గత పది ఏళ్లు అధికారంలో ఉండి న్యాయం చేయకుండా ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా నష్టపరిహారం చెల్లించామని కపట ప్రేమ చూపడం హాస్యాస్పదం అన్నారు. నిర్వాసితుల బతుకులను ఆగం చేసిన మీరు మా జోలికి వస్తే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

మా ఎమ్మెల్యే కేసీఆర్ కాదా ? మా సమస్యలు పట్టించుకోకుండా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడడం మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు మా సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నారా సూటిగా ప్రశ్నించారు. గతంలో మాట కూడా మాట్లాడని హరీష్ రావు దేశంలో ఎక్కడా లేనివిధంగా నష్టపరిహారం చెల్లించామని చెప్పడం దురదృష్టకరమన్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజల పేరుతో దోచుకున్న డబ్బుకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించినప్పుడు దారి ఖర్చుల కోసం రూ. 50 వేలు ఇచ్చామని చెప్పడం బాధాకరమని అన్నారు. ఉనికి కోసం అబద్ధపు, తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు పలికారు.

మల్లన్న సాగర్ పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నిర్వాసితులకు సంబంధం లేకుండా నిధులు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. నలుగురికి అన్నం పెట్టే రైతులం..పూట గడవని పరిస్థితుల్లో ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఏ ఏం సి డైరెక్టర్ నర్సింహారెడ్డి, తొగుట మాజీ పీఏసీఎస్ చైర్మన్ కురకుల మల్లేశం, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పల్లె పహాడ్ మాజీ ఉప సర్పంచ్ రమేష్, స్వామి, రాములు, లక్ష్మణ్, లస్కర్ సత్తయ్య, మల్లేశం, ధర్మారెడ్డి, లక్ష్మాపూర్ సత్తయ్య, శ్రీహరి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed