MLA : కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపల పంపిణీ లేనట్టేనా..?

by Kalyani |
MLA : కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపల పంపిణీ లేనట్టేనా..?
X

దిశ, సంగారెడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వంలో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు చేపల పంపిణీ లేనట్టేనా అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎద్దేవా చేశారు. మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేసిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ పై ఇంకా సరైన స్పష్టత లేదని, కొన్ని జిల్లా కేంద్రాలలో 50 శాతం మాత్రమే చేపపిల్లల పంపిణీ చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్న ఆచరణలో మాత్రం లేదని విమర్శించారు. జులై నెలలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ చెరువులకు చేప పిల్లలు చేరే అంశంపై సందేహాలు కనిపిస్తున్నాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మత్స్యకారులు సంతోషంగా జీవనం ఉండేదని, కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టి కోసం ఎంతో ముందుచూపుతో వ్యవహరించేదని కొనియాడారు.

చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగింపుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వక పోవడంతో నీలి నీడలు అలుముకుంటున్నాయనే అనుమానాలను వ్యక్తం అవుతున్నాయన్నారు. దీనివల్ల చేప పిల్లల మీద ఆధారపడిన సంఘాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గంలో 51,46,770 లక్షల చేపపిల్లలను పంపిణీ చేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్య రంగానికి కేవలం రూ.16 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆరోపించారు. గత ఏడాది తరహాలో పూర్తి స్థాయిలో చేపల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఆర్.వెంకటేశ్వర్లు, మురళీ, విఠల్, సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story