రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. గుండా రాజ్యం నడుస్తుంది : ఎమ్మెల్యే హరీష్ రావు

by Sumithra |
రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. గుండా రాజ్యం నడుస్తుంది : ఎమ్మెల్యే హరీష్ రావు
X

దిశ, నర్సాపూర్ : రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని గుండా రాజ్యం నడుస్తున్నదని రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే సునీత రెడ్డి అనుచరుల పై దాడి చేసిన విషయం పై తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా గోమారంలో ఏర్పాట్లు చేసిన విలేకరులతో ఎమ్మెల్యే సునీత రెడ్డితో కలిసి మాట్లాడుతూ సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు గూండా రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.

ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయని పేర్కొన్నారు. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాదులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, రాష్ట్రంలో గుండు రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతుందని ఆరోపించారు. తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి బీహార్ లాగా తెలంగాణను మారుస్తున్నారని విమర్శించారు. సునీత లక్ష్మారెడ్డి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని, ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకాయలు కాల్చడం, ఇంట్లోకి పటాకాయలు విసరడము ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైనదని తెలిపారు.

వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారని, హెడ్ కానిస్టేబుల్ చేతులోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే హెడ్ కానిస్టేబుల్ కింద పడిపోయాడు. పోలీసుల పై దాడి జరిగినా కేసు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారని పేర్కొన్నారు. పోలీసు అధికారులు ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదని గుర్తు చేశారు.

10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా అని ప్రశ్నించారు. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరని మండిపడ్డారు. వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడిని ప్రోత్సహించిన వారి పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా వెళ్తాం అన్నారు. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టమని చెప్పారు. ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన అని అన్నారు.

మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతంతో తెలంగాణ ప్రజలతో మాది పేగు బంధం.. ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అన్నారు. అదే విధంగా ప్రభుత్వం పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిదని తెలిపారు. ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలని సూచించారు. డీజీపీ ఉన్నతమైన పదవిలో ఉన్నారు.

మీరు ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దని సూచించారు. రాష్ట్ర డీజీపీ వెంటనే ఈ ఘటన పై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ ఆఫీస్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతి, ఎర్రోళ్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నహీం, దొంతి సంతోష్ రెడ్డి, సత్యం గౌడ్, శేఖర్, మన్సూర్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీలు హరికృష్ణ, నర్సింలుతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story