నిమిషం లేట్.. గెట్ అవుట్! గ్రూప్-1 ప్రిలిమ్స్‌‌‌కు ఆలస్యంగా పలువురు అభ్యర్థులు

by Ramesh N |
నిమిషం లేట్.. గెట్ అవుట్! గ్రూప్-1 ప్రిలిమ్స్‌‌‌కు ఆలస్యంగా పలువురు అభ్యర్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల వరకే అనుమతిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించిన క్రమంలో అభ్యర్థులను ముందుగానే సెంటర్లకు చేరుకున్నారు. సెంటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో అభ్యర్థిని చెక్ చేసిన అనంతరమే సిబ్బంది ఎగ్జామ్‌ సెంటర్‌లోకి అనుమతించారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెంటర్ల వద్ద కొంత మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో నిరాశతో వెనుదిరిగారు.

సిద్దిపేట డిగ్రీ కాలేజీ సెంటర్‌ వద్దకు నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన పది మంది అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. దీంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాల సెంటర్ కి ఆలస్యం గా వచ్చిన‌‌ ఓ యువకుడిని అధికారులు అనుమతి ఇవ్వలేదు. గోదావరిఖనిలోని బాలికల జూనియర్ కళాశాల ఎగ్జామ్ సెంటర్ కి వచ్చిన తీగల కావేరి అనే యువతి 8 నిమిషాలు ఆలస్యంగా రావడంతో సిబ్బంది తిరిగి పంపించారు. కాగా, రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టులను గ్రూప్‌-1 ద్వారా టీజీపీఎస్సీ భర్తీ చేస్తోంది. ఈ పరీక్ష కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 897 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం చేసింది.

Advertisement

Next Story

Most Viewed