‘హైడ్రా’ తరహా చర్యలు.. వనపర్తిలో ప్రకంపనలు

by srinivas |
‘హైడ్రా’ తరహా చర్యలు.. వనపర్తిలో ప్రకంపనలు
X

దిశ ప్రతినిధి వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా దడ పుట్టిస్తున్న హైడ్రా తరహా చర్యలు వనపర్తిలోకి అడుగుపెట్టాయన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లా కేంద్రం పరిధిలో ఉన్న నాలుగు చెరువుల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న కొన్ని నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో నోటీసులు అందుకున్న బాధితులు తాము అన్ని అనుమతులతోనే ఇండ్లు నిర్మించుకున్నామని, ఇలా నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దడ పుట్టిస్తున్న అధికారుల చర్యలు...

ఎఫ్‌టీఎల్ బౌండరీని గుర్తిస్తూ ఆ పరిధిలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇస్తుండడంతో ప్రజలు దడదడలాడిపోతున్నారు. ముఖ్యంగా వనపర్తి జిల్లా కేంద్రంలో నల్లచెరువు, తాళ్ల చెరువు, అమ్మ చెరువు, మర్రికుంట కలిపి మొత్తం నాలుగు చెరువులు ఉన్నాయి. అయితే వీటి పరిధిలో చాలా ఏళ్ల క్రితమే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయించారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉండడంతో చాలామంది ఇళ్ల స్థలాలను కొని పెట్టుకున్నారు. కొందరు మున్సిపాలిటీకి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ రుసుము చెల్లించి అన్ని అనుమతులు తీసుకొని ఇండ్లను నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.

ఇటీవల రాష్ట్ర రాజధానిలో ఎఫ్‌టీ‌ఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా వంటి చర్యలు జిల్లాలకు సైతం పాకాయి. దీనిలో భాగంగానే వనపర్తిలో మున్సిపల్ అధికారులు మర్రికుంట పరిధిలో 9 నివాసాలకు, తాళ్లచెరువు పరిధిలో 6 ఇండ్లకు నోటీసులు జారీ చేశారు. అలాగే నల్లచెరువు, అమ్మ చెరువు పరిధిలో ఎఫ్ టీఎల్ బౌండరీని బఫర్ జోనును గుర్తించే పనిలో పడ్డారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న అక్కడి నిర్మాణాలకు సైతం నోటీసులు జారీ చేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారి కరుణాకర్ దిశకు తెలిపారు.

ఎలాంటి భయం వద్దని బాధితులకు అండగా ఎమ్మెల్యే మేఘారెడ్డి

మర్రికుంట సమీపంలో వేసిన వెంచర్‌లో ప్లాట్‌ను కొనుగోలు చేసి అన్ని అనుమతులు తీసుకొని ఇంటిని నిర్మించుకున్నాం. ఇంటి నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చిన మున్సిపల్ అధికారులే ఇప్పుడు నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉంది. సమస్యను ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకుపోగా ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉన్నవారికి ఎలాంటి భయం వద్దని ఎవరు కూల్చారని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed