తెలంగాణను బాగు చేసేపనిలో సీఎం రేవంత్ : మంత్రి కొండా సురేఖ

by karthikeya |   ( Updated:2024-10-08 05:30:23.0  )
తెలంగాణను బాగు చేసేపనిలో సీఎం రేవంత్ : మంత్రి కొండా సురేఖ
X

దిశ, అచ్చంపేట: గడిచిన పదేళ్లలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, తెలంగాణను పాడు చేసిందని.. అలాంటి తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి బాగు చేసే పనిలో నిమఘ్నమయ్యారని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్ రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారని, రాష్ట్రం కోసం అహర్నిశలు పాటు పడుతున్నాడని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న కొండా సురేఖ.. శ్రీ ఉమామహేశ్వర ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆలయ చైర్మన్‌గా మాధవరెడ్డితో పాటు మరో 16 మందితో డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు ఈ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేశారని, దాంతో ఆదాయ వనరుగా ఉన్న రాష్ట్రం అప్పుల ఉబిలోకి వెళ్లిపోయిందని అన్నారు. పదవులు అందరికీ రావని, వచ్చిన వారు ఆ పదవులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

చాతనైతే మంచి సలహా ఇవ్వాలి.. ప్రజను తప్పుదోవ పెట్టరాదు...

బీఆర్ఎస్ నాయకులు చేతనైతే రాష్ట్ర అభివృద్ధికీ తమ వంతుగా మంచి సలహా ఇవ్వాలని, అంతేకానీ ప్రజను తప్పుదోవ పట్టించరాదని అన్నారు. కెటిఆర్, హరీశ్‌రావులు కావాలని అధికార పార్టీపై బురద చల్లే పనిలో ఉన్నారని విమర్శలు చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల ద్వారా గత ప్రభుత్వం 15 వందల కోట్ల రూపాయలను తమ జేబుల్లో నింపుకుందని, వారి తప్పుడు విధానాల వల్లనే రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. ప్రజల నమ్మకం తమపై ఉండబట్టే అధికారం కట్టబెట్టారని, రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం అమలు చేసే పథకాలు గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సీఎం చిత్తశుద్ధి గురించి, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలందరికి వివరించాలని పిలుపునిచ్చారు.

త్వరలో 11వేల ఉపాధ్యాయ పోస్టులు...

గడిచిన 10 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, త్వరలోనే మరో 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తుందని, నిరుద్యోగులకు వీలైనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వం లక్షమని అన్నారు. తదుపరి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరిన విధంగా ఆలయం వద్ద గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నా ప్రత్యేక నిధుల నుండి నిధులు కేటాయిస్తాన్నారు. అలాగే రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ ..అచ్చంపేట ప్రాంతంలో క్రీడాభివృద్ధికి ప్రత్యేకంగా తన సహకారం అందించి ఎన్టీఆర్ స్టేడియాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తానన్నారు.

ఎమ్మెల్యే సమస్యలను మంత్రి దృష్టికి...

ఈ సమావేశంలో ముందుగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. నల్లమల్ల ప్రాంతం టూరిజం హబ్బుగా మార్చేందుకు 16 టూరిజం కేంద్రాలు ఉన్నాయని, అన్ని అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించాలని, ఆరు లక్షల హెక్టార్లలో నల్లమల్ల అడవి ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలోనే ఉందని, ఒకరోజు సమయం ఇచ్చి టూరిజం అభివృద్ధి కోసం పర్యటించాలని మంత్రిని కోరారు. అన్నదాన సత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రూ.50 లక్షలు, కల్యాణ మండపం కోసం కోటి నిధులు అవసరం ఉందని, ఓల్డ్ గెస్ట్ హౌస్ పునరుద్ధరణ కోసం రూ.25 లక్షలు కేటాయించాలని, పంచలింగాల నుండి ఉమామహేశ్వర క్షేత్రానికి, శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ఉన్న ప్రతాపరుద్ధుని కోట నుండి ఉమామహేశ్వర వరకు సుమారు 5 కిలోమీటర్లు రూప్ వే నిర్మాణం కోసం 55 కోట్లు నిధులు కేటాయించాలని వివిధ సమస్యలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed