కాంగ్రెస్ పార్టీని గెలిపించి పాలమూరు ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం : వంశీచంద్ రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ పార్టీని గెలిపించి పాలమూరు ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం : వంశీచంద్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అవినీతితో రాజ్యమేలాలనే వక్రబుద్ధి అక్రమార్కులను ఓడించి, కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచి పాలమూరు ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని కాపాడుకుందామని మహబూబ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కేంద్ర కార్యాలయంలో వివిధ మండలాల గ్రామాలలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.

10 ఏండ్లు పాలించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ యంత్రాలుగా మరి, ఇప్పుడు అభివృద్ధి మంత్రం జపిస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 4 నెలల ప్రజాపాలనను ప్రశ్నించే ముందు 10 ఏండ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో రైతులకు రెట్టింపు ఆదాయం,యువతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు,జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు రూపాయలు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మాణం లాంటి అనేక హామీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు వివరించాలని ఆయన నిలదీశారు.

ఇలాంటి ధోరణే డీకే అరుణ అవలంభిస్తోందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను పాడె నెక్కించేందుకే మళ్ళీ ఎంపీగా పోటీలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇలాంటి మోసపూరిత శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ,ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే సత్తా గల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన హస్తం గుర్తు కే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చల్లా వంశీచంద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed