Collector Sikta Patnaik : రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దు..

by Sumithra |
Collector Sikta Patnaik : రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దు..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ ద్వారా జమ అయ్యే ఋణం గైడ్ లైన్స్ ప్రకారం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేరుగా రైతులకు చేరేలా బ్యాంకర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాస్థాయి బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, ట్రైనీ కలెక్టర్ గరీమా నరులతో కలిసి రైతు రుణమాఫీ మార్గదర్శకాల అమలు పై కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా వేల కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమచేస్తునట్లు ఆమె తెలిపారు. మొదటి విడతలో నారాయణపేట జిల్లాలోని 28,684 మంది రైతులకు గాను రూ. 165.4 కోట్ల రూపాయలు రైతులకు రుణ మాఫీ లబ్ధి చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రుణమాఫీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వారి రుణఖాతాలో జమ అయిన డబ్బులను నేరుగా రైతులకే అందేటట్లు చూడాలన్నారు.

వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతిరైతు వేదికలో రైతుల జాబితాను ప్రదర్శించాలన్నారు. రైతులకు సంబంధించిన 1 బి, ఆధార్ కార్డు , భూమికి సంబంధించిన్ పాస్ పుస్తకం తదితర డాక్యుమెంట్స్ తీసుకొని రెనివల్ కోసం బ్యాంకుకు రావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతిలో కూడా రైతులకు సంబంధించి వివరాలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆమె ఆదేశించారు. 30 రోజుల పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉండి రైతు రుణమాఫీ రైతులకు చేరేలా చూడాలన్నారు. లిస్టులో రైతుల పేర్లు లేని యెడల జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఆమె తెలిపారు.

2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఆగస్టు నెలాఖరి వరకు రెండు లక్షల రుణమాఫీ వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. బ్యాంకులకు వచ్చే రైతుల పట్ల బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలని చెప్పారు. జిల్లాలో రైతు రుణమాఫీని వంద పూర్తిచేసి రాష్ట్రస్థాయిలో జిల్లాను మొదటి వరుసలో ఉంచాలని ఈ సందర్భంగా బ్యాంకర్లను కలెక్టర్ కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రైతు రుణమాఫీ అమలు ఒక పండగ వాతావరణంలో కొనసాగేలా చూడాలని, మరీ ముఖ్యంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని జిల్లా అనేది బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు గుర్తుపెట్టుకోవాలని ఆమె తెలిపారు.



Next Story