Collector : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి..

by Sumithra |
Collector : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి..
X

దిశ, బిజినేపల్లి : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం బిజినేపల్లి మండల కేంద్రంలోని సంత బజార్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరగతి గదుల్లోకి వెళ్లి ఐదో తరగతి విద్యార్థుల గణితంలో తీసివేతలు, భాగాహారం సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఉపాధ్యాయుల హాజరు గురించి వాకబు చేశారు. తరగతి గదులను సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న బోధనా తీరును పరిశీలించారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు అందించడం జరుగుతోందని గుర్తు చేశారు.

ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని, ఏకాగ్రతతో చక్కగా చదువుకుని తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఏవైనా సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల సామర్ధ్యాల పై సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాలలోని అన్ని గదులను కలెక్టర్ పరిశీలించి, వర్షానికి గదుల్లోకి నీరు కారుతుండడం గమనించి, అందుకు కావలసిన ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల వంటగది నిర్మాణాన్ని చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా 9.5 లక్షల రూపాయలతో పాఠశాలకు కావలసిన నిర్మాణ పనులు, రిపేర్లను పూర్తి చేయాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని పాఠశాలలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పై అంతస్తులో ఉన్న తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదుల్లో వర్షపు నీరు కురవకుండా తగిన మరమ్మత్తులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం బిజినపల్లి మండలంలోని మంగనూరు శివారు ప్రాంతమైన చేగుంట స్టేజి దగ్గర నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించిన సర్వేనెంబర్ 801 లో ఉన్న ఆదర్శ పాఠశాల నిర్మాణానికి కావలసిన స్థలాన్ని పరిశీలించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధికి చెందిన ఇంటిగ్రేటెడ్ ఆదర్శ పాఠశాల నిర్మాణానికి 20 ఎకరాల స్థలం కావాలని, సువిశాలమైన క్రీడా ప్రాంగణం విశాలమైన తరగతి గదులు, ఉపాధ్యాయుల వసతి గృహాలు తదితర నిర్మాణాలతో సువిశాల ప్రాంగణం ఉండేలా ప్రభుత్వ భూమి చూడాలని కలెక్టర్ తాహశీల్దార్ ఆదేశించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఆదర్శ పాఠశాలకు అనువైన స్థలాన్ని పరిశీలించాలని ఆర్డీవోను ఫోన్ ద్వారా ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి రమాదేవి, బిజినపల్లి తహశీల్దార్ శ్రీరాములు , ఎంపీడీవో కథలప్ప, బిజినపల్లి పంచాయతీ కార్యదర్శి మహేష్ నాయక్ తదితరులు ఉన్నారు.



Next Story