TPCC Chief: ఏ కార్యకర్తను చేజార్చుకోం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ భరోసా

by Prasad Jukanti |   ( Updated:2024-10-23 10:13:17.0  )
TPCC Chief: ఏ కార్యకర్తను చేజార్చుకోం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ భరోసా
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరికలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి ఏ విమర్శలు చేసిన అది ఆయన వ్యక్తిగతం అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖీ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య దురదృష్టకరం అన్నారు. ఆయన జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని చెప్పారు. అందరితో చర్చించి, అన్ని ఆలోచించిన తర్వాతే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నామన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఒక్క కార్యకర్తను చే జార్చుకోబోమని, అందుకోసం ప్రత్యేకమైన మెకానిజం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నేను చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారన్నారు. అక్కడక్కడ సీనియర్ నాయకులు ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవం అన్నారు.

రేవంత్ రెడ్డికి పార్టీలో ఫుల్ సపోర్టు:

ముఖ్యమంత్రి ఖుర్చీ నుంచి రేవంత్ రెడ్డిని దింపేందుకే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా మతకలహాలు సృష్టిస్తున్నదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను మహేశ్ కుమార్ గౌండ్ ఖండించారు. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఉందని, సీఎంను దింపేందుకే ఇలా చేస్తున్నారని మాట్లాడేందుకు మీరెవరని ఈటలను ప్రశ్నించారు. వామపక్ష భావజాలంతో ఉండి బీజేపీ లోకి వెళ్ళింది ఈటెల రాజేందర్ కాదా అని నిలదీశారు. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు ఎంతమేర నెరవేర్చారో ఈటెల మోడీని అడగాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏ ఇబ్బంది లేదని హత్య రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. ఏ పార్టీ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఆకాంక్షించారు. బీజేపీ నేతలు మాట్లాడే దానికి అర్ధం ఉండాలని, మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మంచిదికాదన్నారు. ప్రతి అంశం తో ఓట్లు దండుకోవాలనుకోవడం అవివేకం అని దుయ్యబట్టారు. మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా? చెప్పాలన్నారు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలనేది కాంగ్రెస్ ధ్యేయం అని చెప్పారు.

కేటీఆర్,హరీష్ రావుకు లోపాయికారీ ఒప్పందం:

ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని పీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. ధరణి ఓ సమస్యల పుట్ట అని విమర్శించారు. కేసీఆర్ ధరణిని సదుద్దేశంతో తీసుకువచ్చారని అనుకున్నాం. కానీ దాని నిర్వహణ ఊరు పేరు లేని సంస్థకు అప్పగించాలని దాంతో రైతులకు అనేక ఇబ్బందులు కలిగాయన్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించిన సంస్థలు కేటీఆర్, హరీశ్ రావుకు మధ్య లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని భూములు కొల్లగొట్టారని సంచలన ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి రావడంతో ల్యాండ్ రికార్డు మేనేజ్ మెంట్ లో సుధీర్ఘ అనువంభవం కలిగిన నేషన్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి ధరణి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుకుందన్నారు.

మూసీపై సమగ్ర నివేదికకు 18 నెలల గడువు:

మూసీ పునర్జీవనం కార్యక్రమాని ప్రభుత్వం వెచ్చించబోయే బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మహేశ్ కుమార్ ఖండించారు. మూసీ ప్రాజెక్టుకు అవసరమైన డీపీఆర్ లు సిద్ధం చేసే బాధ్యతను ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఐదు ప్రముఖ సంస్థలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందన్నారు. డీపీఆర్ కోసం రూ.141 కోట్లు కేటాయించామని ఆ ఐదు కంపెనీలు కలిసికట్టుగా మూసినదికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి డీపీఆర్ ఇస్తాయన్నారు. నది పునర్జీవనం ఎలా చేయాలి, అందుకు అయ్యే నిధులు ఏ విధంగా సమీకరించుకోవాలి తదితర అంశాలతో పూర్తిస్థాయిలో నివేదిక ఆయా కంపెనీలు ఇస్తాయన్నారు. సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వము 18 నెలలు గడువు విధించిందని ఆ సంస్థలు ఇచ్చే నివేదిక ఆధారంగా మూసి పునర్జీవ కార్యక్రమం ప్రభుత్వ చేపడుతుందని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు ఈ మూసీ ప్రాజెక్టుకు రూ. 1,50,000 కోట్లు అవుతాయంటూ రాద్ధాంతం చేయడంలో అర్థం లేదన్నారు. ఏదో ఒక సంఖ్యను చెప్పుకుంటూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేయడము సరికాదని ప్రతిపక్షాలకు సూచిస్తున్నానన్నారు.

Advertisement

Next Story