KTR : తెలంగాణ ప్రభుత్వానికి కేటీఆర్ డెడ్‌లైన్.. లేదంటే 50 వేల మంది రైతులతో..

by Rajesh |
KTR : తెలంగాణ ప్రభుత్వానికి కేటీఆర్ డెడ్‌లైన్.. లేదంటే 50 వేల మంది రైతులతో..
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాళేశ్వరం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్ హౌస్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్దదయిన భారత దేశ స్వతంత్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వేగంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. తెలంగాణకు కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. తెలంగాణలో కరువు అనే మాట వినిపించకుడదని ఈ ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు గతంలో నీటి సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

పంటల సాగు కోసం నీటిని ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. ఎగువ నుంచి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. 17 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ నిర్మించామన్నారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం దీన్ని నిర్మించినట్లు స్పష్టం చేశారు. సాగు అవసరాల కోసం 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మించామన్నారు. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారెస్పీలో కేవలం 25 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయన్నారు. 26 టీఎంసీలు ఉండాల్సిన ఎల్‌ఎండీలో ఇవాళ కేవలం 5 టీఎంసీలు ఉన్నాయన్నారు. డెడ్ స్టోరేజీ 3టీఎంసీలు అన్నారు.

25 టీంఎసీల మిడ్ మానేరులో కేవలం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయన్నారు. వంద భాగాలు ఉన్న కాళేశ్వరంలో కేవలం మేడిగడ్డలో చిన్న లోపాన్ని భూతద్దంలో కాంగ్రెస్ సర్కారు చూయిస్తుందన్నారు. కరువు పరిస్థితులు ఉన్నా మోటార్లు ఆన్ చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఈ ప్రాజెక్టులన్నీ నిండు కుండలా ఉన్నాయన్నారు. పంపు హౌజ్‌లను నడిపితే రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోయొచ్చన్నారు.. కానీ రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని తెలిపారు.

ఖాళీగా ఉన్న ప్రాజెక్టులను కాళేశ్వరంతో నింపొచ్చన్నారు. సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టినా కాంగ్రెస్ సర్కారుకు వినియోగించుకోవడం తెలియడం లేదన్నారు. నీళ్లు ఎత్తిపోయకపోతే 50 వేల మంది రైతులతో తామే వస్తామన్నారు. పంపులు తామే ఆన్ చేసి రైతులకు నీళ్లు అందిస్తామన్నారు. అసెంబ్లీ ముగిసే వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తామన్నారు. ఆగస్టు 2 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.



Next Story