హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

by Sridhar Babu |
హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి
X

దిశ,టేకులపల్లి : కోయగూడెం ఓసీ 2 నిర్వాసితులకు హైకోర్టు తీర్పు ప్రకారం భూమి నష్టపరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును హర్షిస్తూ ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలో నిర్వాసితులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రేపాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం ఏ ప్రాజెక్టుతోనైనా సాగు భూములు కోల్పోయిన గిరిజనులకు భూమికి బదులు భూమి, నష్టపరిహారం, ఉపాధి కల్పించాలని ఉన్నప్పటికీ ఒక్క పైసా నష్టపరిహారం, పునరావాసం చెల్లించలేదన్నారు. దీంతో వ్యవసాయ కార్మిక సంఘం, నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, న్యాయపోరాటం చేశామని తెలిపారు.

హైకోర్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని తీర్పు ఇవ్వడాన్ని ఆయన హర్షించారు. బేతంపూడి పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ మాట్లాడుతూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, హైకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య , ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుగ్గి క్రిష్ణ మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్లు హైకోర్టు తీర్పును అమలు చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన హక్కులను కాలరాస్తూ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఈసం నరసింహారావు, కడుదుల వీరన్న, పూనెం స్వామి, పూనెం చంద్రశేఖర్, దొడ్డ సంపత్ కుమార్, భూక్యా రవి, నిర్వాసితులు పాల్గొన్నారు.

Advertisement

Next Story