రూ.80 అదనం...రూ.కోట్లలో ఆదాయం

by Sridhar Babu |
రూ.80 అదనం...రూ.కోట్లలో ఆదాయం
X

దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేటలో మద్యం వ్యాపారులు సిండికేట్ మాఫియాగా ఏర్పడి మద్యంప్రియులను దోచుకుంటున్నారు. ఒక్కో మద్యం బాటిల్ పై రూ.20 నుండి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తూ రూ. కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు. అయినా ఎక్సైజ్ శాఖాధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇతర శాఖల అధికారులు కూడా మామూళ్ల కోసం చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ దోపిడీ బెల్టు దుకాణాల్లో ఎక్కువగా జరుగుతోంది. ఏటా రూ. 18 నుండి రూ.20 కోట్ల వరకు మద్యం మాఫియా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

మద్యం విక్రయాల్లో ప్రభుత్వం కఠిన మార్గదర్శకాలు జారీ చేస్తున్నా కొందరు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి దోపిడీ చేస్తున్నారు. బెల్టు దుకాణాలను ప్రోత్సాహిస్తూ ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. మద్యం దుకాణాల్లో ప్రభుత్వం ప్రకటించిన ఎమ్మార్పీ ధరకే వ్యాపారులు విక్రయించాలి. కానీ ఒక్కో బాటిల్​పై (బాటిల్ సైజును బట్టి) రూ.20 నుండి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీనికి తోడు విచ్చలవిడిగా వెలిసిన బెల్టు దుకాణ నిర్వాహకులు రూ.20 నుండి రూ.100 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు.

రూ.18 కోట్లపైనే దోపిడీ

మండలంలో మొత్తం 8 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిని కొందరు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పాటు చేసుకుని అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్లను వ్యాపారులు దుకాణాల్లో విక్రయించకుండా బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెల్టు దుకాణాలకు తరలించడం వల్ల క్వార్టర్ బాటిల్​కు రూ.20, ఫుల్ బాటిల్​కు రూ.80లకు పైగా వసూలు చేస్తున్నారు. దుకాణాల్లో విక్రయించాల్సి వస్తే ఎమ్మార్పీకి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ఎక్కువ డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లను బెల్టు దుకాణాలకు తరలిస్తూ పరోక్ష దోపిడీకి పాల్పడుతున్నారు. ఇక దుకాణాల్లో డిమాండ్ లేని బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తున్నారు. సిండికేట్ తో పాటు బెల్టు నిర్వాహకులు సుమారు 40 శాతం అదనంగా మందుబాబులను దోచుకుంటున్నారు.

ఒక్కో దుకాణం ద్వారా ఏటా సుమారు రూ. 7 నుంచి రూ.8 కోట్ల మద్యం వ్యాపారం సాగుతోంది. మొత్తం 3 మద్యం దుకాణాల ద్వారా రూ.38 నుండి రూ.42 కోట్లపైనే మద్యం విక్రయాలు సాగుతున్నాయి. దీని ప్రకారం 40 శాతం వరకు సిండికేట్, బెల్టు నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్న అక్రమార్జన రూ.18 నుండి రూ.20 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అయినా ఎక్సైజ్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏటా కేసుల టార్గెట్తో నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. అలాగే పోలీస్ లకు కూడా బెల్టు దుకాణాల నియంత్రణ బాధ్యత ఉన్నా పట్టించుకోకపోవడంతో పలు ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో మాత్రం కొందరు బెల్టు వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా సిండికేట్ మాఫియా ఇచ్చే మామూళ్ల మత్తులో వీరు తూగుతున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై పోలీస్ శాఖ సీఐని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.

దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం : ఎక్సైజ్ సీఐ రాజశేఖర్

మద్యం దుకాణాల్లో అధిక ధరలు, బెల్టు దుకాణాల నిర్వాహణపై విచారిస్తాం. ప్రాథమిక విచారణలో వాస్తవాలు ఉంటే దాడులు చేసి వారిపై చర్యలు తీసుకుంటాం. అధిక ధరలు, బెల్టు దుకాణాలను ఉపేక్షించం. ప్రభుత్వ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తాం.

Advertisement

Next Story

Most Viewed