కుటుంబ కార్డు ద్వారా అర్హులకు సంక్షేమ పథకాల అమలు: మంత్రి పొంగులేటి

by Aamani |
కుటుంబ కార్డు ద్వారా అర్హులకు సంక్షేమ పథకాల అమలు: మంత్రి పొంగులేటి
X

దిశ,తిరుమలాయపాలెం: కుటుంబ కార్డు ద్వారా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ,సమాచార పౌర సంబంధాల,గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి, తిరుమలాయపాలెం మండలం లో పర్యటించి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ తో కలిసి జల్లేపల్లి గ్రామంలో ఎం.జి.ఎన్.ఆర్.జి.ఎస్. నిధులు రూ. 20 లక్షల అంచనాతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. జల్లేపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి పంచాయతీ సొంత భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

అక్టోబర్ నెలాఖరు నాటికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద కుటుంబ కార్డు అందించేందుకు సర్వే జరుగుతుందని అన్నారు. కుటుంబ కార్డు ద్వారా రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, పెన్షన్, రుణమాఫీ మొదలగు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. గ్రామంలో అవసరమైన సీసీ రోడ్లను చేపట్టి సంవత్సరం లోపు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. కుటుంబ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. రూ. 2 లక్షల వరకు రుణాలు ఉన్న కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారు భయపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే అర్హులందరికీ రుణమాఫీ సొమ్ము జమ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామంలో పంచాయతీ భవనం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన చోట నూతన భవనాలు మంజూరు చేస్తామని,పురోగతిలో ఉన్న భవనాలను మంత్రి సహకారంతో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.

గ్రామ పంచాయతీలలో ఉన్న రోడ్డు, డ్రైయిన్ ఇబ్బందులను క్రమ పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామని అన్నారు. పంచాయతీకి సొంత భవనం చాలా ఉపయోగపడు తుందని,గ్రామంలో చిన్న,చిన్న సమావేశాల నిర్వహణకు మంచి వేదిక అవుతుందని అన్నారు.గ్రామ పంచాయతీ భవనంలో ఒక రూమ్ ను స్థానిక యువత కోసం రీడింగ్ రూమ్ గా ఏర్పాటు చేసుకోవాలని,దీనికి అవసరమైన పుస్తకాలు,ఇతర సహకారం జిల్లా యంత్రాంగం అందజేస్తుందని అన్నారు. అనంతరం తిరుమలాయపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం పథకానికి సంబంధించిన,లక్ష 116 రూపాయల చొప్పున మొత్తం 35 లక్షల 4 వేల 60 రూపాయల చెక్కులు, 48 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మొత్తం 17 లక్షల 28 వేల రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. ఆర్డీఓ గణేష్,మండల తహశీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ సిలార్ సాహెబ్,నాయకులు బెల్లం శ్రీను, మంగీలాల్,అశోక్,తాటికొండ కిరణ్ మార్, ఇతర శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed