నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి వినోద్ రావు

by Disha Web Desk 15 |
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి వినోద్ రావు
X

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. వినోద్ రావు అభ్యర్థిత్వాన్ని కర్ణాటక- తమిళనాడు బీజేపీ కో ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి బలపర్చారు. ఆయన వెంట బీజేపీ ఖమ్మం అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షుడు రంగా కిరణ్ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ నామినేషన్ పాత్రలను స్వీకరించారు. అనంతరం మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ వేసిన వినోద్ రావు కి అభినందనలు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని సుధాకర్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందనని, ఎన్డీఎ పొందే 400 పై చిలుకు సీట్లలో ఖమ్మం కూడా ఉంటుందని చెప్పారు. గడిచిన పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి,

అమలు పరిచిన సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉందని, మూడో సారి బీజేపీ కి ఓటు వేసి ప్రధానిగా చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం మూడవ స్థానానికి వెళ్తుందని అన్నారు. వినోద్ రావు మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ దేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న మోడీ ని మళ్లీ ప్రధానిగా గెలిపించాలని అన్నారు. తన విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయడానికి ముందు వినోద్ రావు కుటుంబ సమేతంగా పట్టణంలోని శ్రీ స్థంబాద్రి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో స్వామి వారి ఆశీస్సులతో తనని గెలిపించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి వంశ రాజు, మాజీ మంత్రి సుజన కృష్ణ రంగారావు తో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed