వరదతో ఉక్కిరిబిక్కిరి అయిన ఖమ్మం రూరల్.. కుదేలైన అన్నదాత

by Jakkula Mamatha |
వరదతో ఉక్కిరిబిక్కిరి అయిన ఖమ్మం రూరల్.. కుదేలైన అన్నదాత
X

దిశ, ఖమ్మం రూరల్​: ఖమ్మం రూరల్​ మండలంలో గత శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మునుపెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ముంచెత్తిన వరద తాకిడికి ఖమ్మం రూరల్​ మండలం ఆకేరు పరివాహక ప్రాంతాలు వణికిపోయాయి. అకేరు, మున్నేరు పరివాహాక ప్రాంతాలైన కస్నాతండా, తనగంపాడు, పిట్టలవారిగూడెం, తీర్థాల, వాల్యతండా, పోలేపల్లి, గోళ్లపాడు, కామంచికల్లు, దానవాయిగూడెం పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా అకేరు తీవ్ర రూపాన్ని దాల్చడంతో భారీ నష్టం వాటిల్లింది. శనివారం అర్థరాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో అప్రమత్తమయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆకేరు నుంచి ఇరువైపులా కిలోమీటరుకు పైగా పంట పొలాలు కోతకు గురయ్యాయి. కొన్ని పంటలు ఇసుక మేటలతో రూపమే మారిపోయింది. రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసుకుంటున్న వారికి ఈ వరద ఓ శాపంగా మారి నష్టం చేకూర్చింది. ఉప్పెనను తలపించే వరదతో రూరల్​మండలం ఉక్కిరిబిక్కిరై ది.

కూలిన ఇండ్లు..మెట కప్పేసిన పొలాలు

ఇండ్లు కూలీ నిరాశ్రయులుగా మిగిలిన చాలామందికి తమ పంట పొలాల్లో సైతం ఇసుక మేటలు, కోతకు గురవడంతో రైతులు కన్నీరు వ్యథ తీర్చలేనిది. మరో రెండేళ్లు గడిచినా పూడ్చలేనంత నష్టం వాటిల్లింది. తమ పంట పొలాలు గుర్తుపట్టలేనంతగా ఇసుక మేటలు వేయడమే కాకుండా విపరీతంగా కోతలు కోశాయి. రైతుల తమ భూమి పూర్వపు విధంగా తయారు చేసుకునేందుకు లక్షల రుపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఒకొక్కరిది ఒక్కో దీనగాథ. పామాయిల్​ తోట, మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టకపోయాయి. దీంతో పాటు పంట నష్టం అంచనా లక్షల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక సమాచారం ప్రకారం పంట నష్ట వివరాలు..పత్తి - 660 ఎకరాలు, మొక్కజొన్న -50ఎకరాలు, వరి - 1991 ఎకరాలు, మిర్చి - 140 ఎకరాలు, పెసర - 36, ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.

సాయం కోసం ఎదురుచూపులు..

ప్రభుత్వం తమకు జరిగిన లక్షల నష్టాన్ని అదుకునేందుకు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందా..అని ఆవేదన చెందుతున్నారు రైతులు. రైతులు వారి ప్రధాన జీవనాధారమైన పంట పొలాలు కొట్టుకపోవడమే కాకుండా పూర్తిగా మేటలు కట్టడంతో వారి బాధ వర్ణించలేనిదిగా మారింది. ఏమైనా ప్రభుత్వం ఖచ్చితమైన అంచనాలు తయారు చేయించి నష్టపరిహారం ఇస్తే కొంతమేర రైతులు అదుకున్నట్లవుతుందని పలు రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కన్నా తండాకు చెందిన బాణోత్​లక్ష్మణ్..​ మూడెకరాల భూమిలో కొంత మిర్చి, కొంత వరి పొలం పెట్టాడు. వరద పోటుతో మిర్చి పంటలో పూర్తి కొట్టకపోవడమే కాకుండా కోతకు గురైంది. వరిలో ఇసుక మేటలు కట్టాయని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికే లక్షకు పైగా ఖర్చు చేసినట్లు వాపోయాడు.

Advertisement

Next Story

Most Viewed