జీవో 59పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

by Satheesh |
జీవో 59పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ఫీజును పెంచేసింది. జీవో 59 ప్రకారం 2014 నాటి మార్కెట్ విలువల ఆధారంగా ఫీజులు లెక్కించడానికి బదులుగా ఇష్టారాజ్యంగా వేస్తున్నారంటూ దరఖాస్తుదారులు ఆందోళన చేశారు. సామాన్యలు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ఫీజుల అంశం గందరగోళంగా మారిందని, ఏ ప్రాతిపదికన లెక్కలు వేస్తున్నారో అంతుచిక్కడం లేదన్న విమర్శలు వినిపించాయి. దాంతో జీవో 59కి సవరణ చేస్తూ జీవో నం.22ని బుధవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జారీ చేశారు. ఇందులో దరఖాస్తు చేసుకున్న నాటి మార్కెట్ విలువల ఆధారంగా పెనాల్టీ వేయనున్నట్లు ప్రకటించారు. గతేడాది దరఖాస్తులు అందాయి. అంటే ప్రస్తుత మార్కెట్ విలువలతోనే లెక్కించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఫీజుల పెంచనున్నట్లు ముందుగానే ‘ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారమే’ అనే శీర్షికతో ‘దిశ’ గత నెల 22న చెప్పింది.

సిస్టం జనరేటెడ్ పేరిట కొత్త మార్కెట్ విలువలతో ఫీజులను విధిస్తూ పంపిస్తున్న నోటీసులతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న అంశంపై సాక్ష్యాధారాలతో సహా ప్రచురించింది. దాంతో తప్పులను సవరించుకునేందుకు ఇప్పటికే జారీ చేసిన నోటీసులకు ఇప్పుడు జీవో జారీ చేయడం గమనార్హం. అంటే ముందుగానే ఫీజులను లెక్కించి, నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు జీవో 59 ని సవరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. తప్పుడు లెక్కలతో నోటీసులు వస్తున్నాయంటూ తహశీల్దార్ కార్యాలయానికి దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారంటూ రెవెన్యూ అధికారులు నవీన్ మిట్టల్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా దరఖాస్తు చేసిన తేదీ నాటి విలువల ఆధారంగానే ఫీజులు ఉంటాయని ప్రకటించారు.

Next Story