BRS ఎమ్మెల్యేలను చేర్చుకుని CM రేవంత్ పొలిటికల్ సూసైడ్: కేపీ వివేకానంద్ గౌడ్

by Satheesh |
BRS ఎమ్మెల్యేలను చేర్చుకుని CM రేవంత్ పొలిటికల్ సూసైడ్: కేపీ వివేకానంద్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా ఆలోచన మాని త్వరలో గడువు ముగియబోతున్న హైదరాబాద్ శివారు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ కోరారు. హైడ్రా ఏర్పాటును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీ వివేకానందగౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పడం అన్యాయమన్నారు.

స్థానిక సంస్థల స్ఫూర్తికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. అధికార వికేంద్రీకరణ చేయాల్సింది పోయి.. అధికార కేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారన్నారు. శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూకబ్జాలు, అవినీతి చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైడ్రాతో మూడు కార్పొరేషన్స్ చేసి అధికారాన్ని చెలాయించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని మండిపడ్డారు. 2007 తర్వాత శివారు ప్రాంతంలో ఉన్న 12 మున్సిపాలిటీలను గ్రేటర్ కార్పొరేషన్‌లో విలీనం చేశారని, ఈ విలీనంతో ప్రజలకు నష్టం జరుగుతుందని వెల్లడించారు.

కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ పరిధిలో పారిశుద్ధ్యం లోపించింది, విష జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు కాబట్టి ఎన్నికలను కాలయాపన చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దివాలా తీసిందని, కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో హైదరాబాద్ కు ఒక్క కంపెనీ రాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ రియాల్టీ తెలుసుకోవాలని సూచించారు.

పాలన మంచిగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని రేవంత్ రెడ్డి అనడం శుద్ధ అబద్దం అన్నారు. అసలు రేవంత్ ఏం చేయడం లేదని, సినిమా తీయకుండానే త్రీడీ సినిమా చూపుతున్నారని విమర్శించారు. ఏం చేయాలన్న దానిపై రేవంత్ఋకు స్పష్టత లేదన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. గత పాలకుల అభివృద్ధిని బీఆర్ఎస్ కొనసాగించిందన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కొనసాగించడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారన్నారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని పిటీషన్ వేశానని, ఎమ్మెల్యేలపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని, తిరిగి గెలిచేది బీఆర్ఎస్ అన్నారు.

కాంగ్రెస్ఋలో చేరినవారికి టికెట్ ఇస్తుందో లేదో అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదని వెల్లడించారు. తాను కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని, పార్టీ మారబోనన్నారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయనని, ప్రతిపక్ష పాత్ర సమర్ధంగా పోషిస్తానని వెల్లడించారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పదేళ్ల అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ కొనసాగించలేకపోతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంచి అవకాశం వచ్చింది.. మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed