తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు మాయగాళ్లు వస్తున్నారు : మంత్రి గంగుల కమలాకర్

by Sridhar Babu |
తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు మాయగాళ్లు వస్తున్నారు : మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్ : అభివృద్ధి చెందిన తెలంగాణను మళ్లీ దోపిడీకి గురి చేసేందుకు మాయగాళ్లు వస్తున్నారని, వారి మాటలు నమ్మి తే ఇక్కడి నీరు, కరెంటు, బొగ్గు దోపిడీ చేసి మళ్లీ తెలంగాణను గుడ్డి దీపంగా మారుస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం, కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నాటి సమైక్యపాలనలో పాలకుల వివక్షకు గురైందని, నిధులు రాక అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని అన్నారు. ఇప్పుడు స్వయంపాలనలో వందలాది కోట్లతో నగరంలో ఏ వాడ చూసినా అభివృద్ధి పనులు జరుగుతూ కనిపిస్తున్నాయని అన్నారు. సమైక్యపాలనలో తాగునీటికి మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కే పరిస్థితులు ఉండేవని, నేడు స్వయంపాలనలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి జలాన్ని అందిస్తున్నామని అన్నారు.

ఎన్నికలు సమీపిస్తుంటే విపక్షాల నాయకులు మాయ మాటలు చెప్పేందుకు వస్తున్నారని... వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలమ్మకు తెలంగాణలో ఏం పని... ఇక్కడి పాదయాత్రలు ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. దొంగల మాటలు నమ్మొద్దని, మన కేసీఆర్ ప్రభుత్వానికి మనం అండగా ఉందామని అన్నారు. ఆడబిడ్డల కళ్లలో ఆనందం కలిగించాలనే ధ్యేయంతో నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతకు మారుపేరని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని చెరువులు నింపడం వల్ల సమృద్ధిగా నీళ్లు ఉన్నాయన్నారు. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి కోసం పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొత్తపల్లి మండలంలోని 47 మంది లబ్ధిదారులకు, కరీంనగర్ అర్బన్ లోని 291, కరీంనగర్ రూరల్ మండలంలోని 32 మంది లబ్ధిదారులకు 3 కోట్ల 70 లక్షల 42 వేల 920 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ప్రతి లబ్ధిదారునికి చెక్కుతో పాటు చీరను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి - హరి శంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Next Story