పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ ఖాతాల్లో డబ్బులు మాయం.. నకిలీ ఖాతాలు సృష్టించి కాజేసిన వైనం

by Aamani |
పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ ఖాతాల్లో డబ్బులు మాయం.. నకిలీ ఖాతాలు సృష్టించి కాజేసిన వైనం
X

దిశ,పెద్దపల్లి: కష్టానష్టాలకొర్చి భవిష్యత్తు అవసరాల కోసం పోస్టాఫీసు ఖాతాల్లో కొంతమంది డిపాజిట్ చేసి దాచుకున్న డబ్బు మాయమైన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఫేక్‌ అకౌంట్లు సృష్టించి, నకిలీ పాస్‌పుస్తకాలు ఇస్తూ సుమారు రూ.35 లక్షలకు పైగా కాజేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై 23వ తేదిన దిశ దినపత్రికలో "పోస్ట్ ఆఫీస్ లో భారీ కుంభకోణం" పేరుతో వార్త ప్రచురితమైంది. ఈ విషయాన్ని గుర్తించిన ఖాతాదారుడు అనుమానంతో ఇటీవల పోస్ట్‌ఆఫీస్‌కు వెళ్లి అడగడంతో అసలు విషయం బయటపడింది. బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ ప్రజల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సేకరిస్తుంది. ఈ క్రమంలో డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన వారికి ఫేక్‌ అకౌంట్‌ నంబర్లు రాస్తూ, నకిలీ పాస్‌ పుస్తకాలు ఇస్తోంది.

గతంలో డబ్బులు డిపాజిట్‌ చేసిన ఓ వ్యక్తి ఇటీవల పోస్ట్‌ ఆఫీస్‌కు వచ్చి తన డబ్బులు డ్రా చేసుకుంటానని చెప్పడంతో రేపు మాపు అంటూ తిప్పించుకుంది. దీంతో సదరు ఖాతాదారుడు సమీపంలోని సెంటనరీ కాలనీ పోస్ట్‌ఆఫీస్‌కు వెళ్లి ఎంక్వైరీ చేయగా అతడికి ఇచ్చిన నంబర్‌పై అసలు అకౌంటే లేదని తేలింది. ఈ విషయాన్ని సెంటినరీ కాలనీ పోస్ట్‌మాస్టర్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పెద్దపల్లి ఇన్‌చార్జి ఐపీవో మోహన్‌ బేగంపేట బ్రాంచ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ను సందర్శించి పాస్‌ పుస్తకాలను తనిఖీ చేశారు. ఈ టైంలో గ్రామానికి చెందిన సుమారు 300 మంది ఖాతాదారులు పోస్ట్‌ ఆఫీస్‌ వద్దకు వచ్చి తమ పాస్‌బుక్ చూపించారు. ఇందులో38 పాస్‌బుక్స్‌ నకిలీవని గుర్తించారు. ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆఫీసర్లు తెలిపారు.

సెంటినరీకాలనీ మెయిన్‌ పోస్టాఫీస్‌లో పని చేసిన నరేంద్రచారి అనే పోస్ట్‌ మాస్టర్‌ కారకుడని, నెల రోజుల సమయం ఇస్తే ఎవరి డబ్బు వారికి చెల్లిస్తానని ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ చెప్పడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ సంస్థలో అక్రమాలు జరిగే అవకాశం ఉండదని డిపాజిట్లు చేశామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని, మా డబ్బులు ఎవరు ఇస్తారంటూ ఖాతాదారులు సెంటినరీ కాలనీ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద ఆందోళనకు దిగారు. బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌పై చర్యలు తీసుకొని, డిపాజిట్‌దారులకు న్యాయం జరిగేలా చూస్తామని పోస్ట్‌మాస్టర్‌, విచారణ అధికారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Next Story

Most Viewed