Collector Koya Sriharsha : పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన..

by Sumithra |
Collector Koya Sriharsha : పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన..
X

దిశ, ముత్తారం : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముత్తారం మండలంలోని ముత్తారం లక్కారం గ్రామాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పోతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పాఠశాలలోని టాయిలెట్లు, భోజన శాల కిచెన్ ఏరియాను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి ప్రాథమిక తరగతుల విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలు కలెక్టర్ పరిశీలించారు.

విద్యా ప్రమాణాల పై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని పిల్లలకు తప్పనిసరిగా చదవడం, రాయడం బేసిక్ మ్యాథ్స్ రావాలని అన్నారు. లక్కారంలో పాఠశాల ప్రహరీగోడ పాక్షికంగా దెబ్బతినడంతో గమనించిన కలెక్టర్ వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసిన అర్హులైన రైతులందరికీ వాటి ఫలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతుల రుణాల రెన్యువల్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముత్తారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముత్తారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ముత్తారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సందర్శించిన కలెక్టర్, ప్రభుత్వం రుణమాఫీ చేసిన రైతుల రుణాల రెన్యువల్ ప్రక్రియను పరిశీలించారు. రుణమాఫీ రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్ రుణమాఫీ జరిగిన రైతులందరి రుణాలు త్వరితగతిన రెన్యువల్ చేయాలని, రుణ మాఫీ ఫలాలు సంబంధిత రైతులకు అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

ముత్తారం మండల తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ క్షేత్రస్థాయి ధ్రువీకరణ ద్వారా పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు కేటాయించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ముత్తారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ గ్రామాలలో చేపట్టాల్సిన పారిశుధ్య చర్యలు, పంచాయతీ కార్యదర్శి విధులు తదితర అంశాల పై సూచనలు జారీ చేశారు.

ముత్తారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రసవాలను నిర్వహించాలని, ప్రస్తుత నెల ప్రసవం జరిగే మహిళలను మ్యాపింగ్ చేసుకొని ఫాలో అప్ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పీ.హెచ్.సీ ద్వారా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, అవసరమైన మందుల స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.

ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట డివిజనల్ పంచాయతీ అధికారి కే సతీష్, ముత్తారం తహశీల్దార్ సుమన్, సింగల్ విండో చైర్మన్ యాదగిరి రావు, డిప్యూటీ డీఎం&హెచ్ఓ డాక్టర్ రవి సింగ్, ముత్తారం ఎంపీడీవో జి.లలిత, మండల పంచాయతీ అధికారి బి.వేణుమాధవ్, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం. వరలక్ష్మి, వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ప్యాక్స్ సీఈఓ ప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ అమరేందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story