కాంగ్రెస్ రైతు సంక్షేమ ప్రభుత్వం

by Sridhar Babu |
కాంగ్రెస్  రైతు సంక్షేమ ప్రభుత్వం
X

దిశ, కోనరావుపేట : కాంగ్రెస్ రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతును రాజు చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని మామిడిపెల్లి గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, నిజామాబాద్ గ్రామంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలని గురువారం ఆయన అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు స్వస్తి పలికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పజెప్పినట్టు పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్యుత్ పంపిణీ చేయాలని ఫైల్ పై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

మునుముందు రైతులకు మేలు కలిగే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో పెట్టిన 9 ప్రాజెక్టుల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒకటి అని, దాని ద్వారా మల్కపేట రిజర్వాయర్ లో నీటిని నింపి కోనరావుపేట మండలంలోని సుమారు 7 వేల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ వచ్చాక ధాన్యం తూకం వేస్తారని చెప్పారు. కొనుగోలు చేశాక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్ముకొని మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా పరిధిలో 258 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనింగ్ మిషన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, అధికారులు, ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story