మళ్ళీ తెలంగాణకు ఐఏఎస్ కాటా ఆమ్రపాలి

by GSrikanth |
మళ్ళీ తెలంగాణకు ఐఏఎస్ కాటా ఆమ్రపాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కాటా ఆమ్రపాలి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కార్యదర్శిగా (సీఎంఓ సెక్రటరీ) వస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2010 బ్యాచ్‌కు చెందిన ఆమె రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ కేడర్‌గా అలాట్ అయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా కొంతకాలం పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్‌కు వెళ్ళిన ఆమె తొలుత (2019 అక్టోబరు 29 నుంచి) కేంద్ర క్యాబినెట్‌లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది కాలం పనిచేశారు. ఆ తర్వాత (2020 సెప్టెంబరు 14న) పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు.

తెలంగాణలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆమె తిరిగి వచ్చేందుకు వీలుగా కేంద్రానికి దరఖాస్తు (రీపార్టియేషన్) చేసుకున్నారు. గతంలో ప్రధాని కార్యాలయంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ శేషాద్రి సూచనల మేరకు ఆమ్రపాలి తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. సెంట్రల్ డిప్యూటేషన్ (పీఎంఓలో) కాలం పూర్తికావడంతో తెలంగాణకు వచ్చిన శేషాద్రి కొంతకాలం జీఏడీలో పనిచేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సైతం సీఎంఓలోకి రావచ్చని సచివాలయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమ్రపాలి శుభాకాంక్షలు తెలిపారు.

కానీ కొద్దిమంది ఆఫీసర్లు మాత్రం ఆమె సీఎంఓలోకి రాకపోవచ్చని, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఓఎస్డీగా ఉండొచ్చని లేదా అక్కడ రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలు చూస్తారని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఆమె నియామకంపై స్పష్టత రానున్నది.

Advertisement

Next Story

Most Viewed