సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు నేను సిద్దం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-19 11:08:29.0  )
సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు నేను సిద్దం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీ సుందరీకరణ వివాదంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరిసిన సవాల్‌కు తాను సిద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన వ్యతిరేకించే బీఆర్ఎస్, బీజేపీ నేతలు మూడు నెలలపాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటే సుందరీకరణ అంశాన్ని పక్కనపెడతానని రేవంత్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మూడు నెలలపాటు తాను మూసీ పక్కన నివాసం ఉంటానని, మరి ఇందుకు సీఎం సిద్ధమేనా అని ప్రశ్నించారు. మూసీ నిర్వాసితులకు భరోసా నిచ్చేందుకు కేంద్ర మంత్రి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు నేను మూడు నెలలపాటు మూసీ ప్రాంతంలో నివాసం ఉంటానని, సీఎం విసిరిన సవాల్ కు కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు.

మూసీ నది శుద్దికి బీజేపీ వ్యతిరేకం కాదని, పేదల ఇళ్లను కూల్చడాన్ని మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజల తరుఫున బీజేపీ పోరాడుతోందనా, వారి ఇళ్లు కూలుస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు.. మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని, వారి తరఫున పోరాడుతామని, అడ్డగోలుగా వచ్చి ఇళ్లపై పడితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి చేతనైతే మూసీలో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కడితే వరదల నుంచి కాపాడుకోవచ్చని, ప్రజలు కోరుకోనప్పుడు మూసీ సుందరీకరణ ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌తో నీతులు చెప్పించుకునే స్థితిలో మేము లేమని, మూసీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్, బీఆర్ఎస్‌కు లేదని, అసలు మూసీ నది సుందరీకరణకు తెరతీసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. ప్రజలు తిరగబడటంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు తోక ముడిచారన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చుతూ చేస్తున్న విధ్వంసకాండకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 25వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Next Story