బీజేపీని ఓడించేందుకు కొన్ని శక్తులు పని చేశాయి

by Sridhar Babu |
బీజేపీని ఓడించేందుకు కొన్ని శక్తులు పని చేశాయి
X

దిశ, జూబ్లిహిల్స్ : బీజేపీని ఓడించేందుకు కొన్ని శక్తులు పని చేశాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు , జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో శనివారం యూసఫ్ గూడలో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లను కలవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాను అని , గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలందరూ ఎంతో కష్టపడ్డారని అన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బీజేపీని ఓడించాలనే కుట్రతో దేశ వ్యాప్తంగా కొన్ని అంతర్జాతీయ శక్తులు కుట్రలు చేశాయని, ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు (కాంగ్రెస్, ఎంఐఎం) ఏకమయ్యాయని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (జూబ్లీహిల్స్, నాంపల్లి) బీజేపీకి మెజారిటీ రాలేదన్నారు. నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రూపంలో మజ్లిస్ పార్టీ పనిచేసిందని, కాంగ్రెస్ పార్టీ గుర్తు కోసం, కాంగ్రెస్ పార్టీ జెండా కింద మజ్లిస్ పార్టీ పనిచేసిందన్నారు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎంతో అవగాహనతో కాంగ్రెస్ పార్టీ

అభ్యర్థి ప్రచారమే నిర్వహించలేదన్నారు. పాదయాత్ర చేయలేదు, సమావేశాలు నిర్వహించలేదన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఎన్నికల ఎత్తుగడను అవలంభించడంలో కొంతవరకు విఫలమయ్యాం మని, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 62 వేల ఓట్లు తగ్గాయని, ఆ ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయన్నారు. అయినా ప్రజల మద్దతుతో బీజేపీకి గతం కంటే ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచంలోని వివిధ దేశాధినేతలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని రాజకీయంగా జీర్ణించుకోలేని కొన్ని శక్తులు కుట్రలకు తెరలేపాయన్నారు. వికసిత్ భారత్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. దేశంలో ఎన్డీయేకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ శక్తులు చాపకింద నీరులాగా పనిచేస్తున్నాయని తెలిపారు.

జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, హ్యాట్రిక్ ప్రధానిగా పదవి అలంకిరించిన ఘనత నరేంద్ర మోదీదే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గౌతం రావు , హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు కిల్లారి మనోహర్ , హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షురాలు జూటూరి కీర్తి రెడ్డి , ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జూబ్లిహిల్స్ కంటెస్టెంట్​ ఎమ్మెల్యే లంకల దీపక్ రెడ్డి, కన్వీనర్ ప్రేమ్ కుమార్ , రామకృష్ణ , గంగరాజు , అనంత లక్ష్మి , కొత్త వెంకటేష్, రూపా, చంద్ర మోహన్ , మోహన్ కుమార్ , కల్పన సింగ్ , సుప్రియ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed