మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ప్రకంపనలు

by Aamani |
మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ప్రకంపనలు
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుండి చెరువులు, కుంటల బఫర్ జోన్ , ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో జరిగిన అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తుండగా తాజాగా కూల్చివేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదలయ్యాయి . నగరంలో సుమారు 55 కిలోమీటర్ల మేర మూసీని సుందరీకరణ చేయాలని నిర్ణయించింది . ఇందులో భాగంగా మూసీకి ఇరువైపులా వంద మీటర్ల మేర జరిగిన ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. కాగా తాజాగా ఆదివారం నుంచి మూసీ పరిధిలో కూల్చివేతలు మొదలు కావడంతో ఆక్రమణలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి . ఆస్తులు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూం ఇండ్లు మాకొద్దు,మమ్మల్ని ఇక్కడే ఉండనీయండి అంటూ ప్రాధేయ పడుతున్నారు. తమ నివాసాలను కాపాడుకునేందుకు కొన్ని చోట్ల స్థానిక నాయకులతో కలిసి ఆందోళనలు తెలిపేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. అయితే ఇప్పటికే చెరువులు, కుంటలు ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తుండడంతో పట్టా భూములలో నిర్మాణాలు చేసుకున్న వారిలో సైతం ఆందోళన మొదలైంది.

ఎక్కడి నుండి వంద మీటర్లు ...

మూసీని అనుసరించి వంద మీటర్ల పరిధిలోని ఆక్రమణలు ,బఫర్ జోన్ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు . ఇందులో భాగంగా పోలీసుల సహాయంతో మూసీ వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందనేది నిర్ధారించారు . అంతేకాకుండా కొన్ని చోట్ల నోటీసులు సైతం జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వంద మీటర్ల పరిధి అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది. ఎక్కడితో ముగుస్తుందనేది అందరిలో సందేహంగా మారింది. ఈ విషయంలో అధికారుల వద్ద కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. కొంతమంది మూసీకి ఇరువైపులా యాభై మీటర్ల చొప్పున వంద మీటర్ల మేర కూల్చివేతలు ఉంటాయంటుండగా మరికొంత మంది ఇరువైపులా వంద మీటర్ల చొప్పున ఉంటుందనే ప్రచారం చేస్తున్నారు. ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని మరింత ఆందోళనలకు గురి చేస్తోంది. మరికొంత మంది ఒకడుగు ముందుకు వేసి యాబై మీటర్లు ఎక్కడి వరకు వస్తుంది.. ? వంద మీటర్ల అయితే ఎంత ఉంటుందని టేపులతో కొలతలు వేసి తమ ఆస్తులు ఉంటాయా, కూలగొడతారా అనే అంచనాకు వస్తున్నారు.

ఆ ప్రాంతాల ప్రజలలో టెన్షన్ ....

గ్రేటర్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది . ముఖ్యంగా జియాగూడ కమేలా రోడ్డు ,పురానాపూల్ , అఫ్జల్ గంజ్ , చాదర్ ఘాట్, మలక్ పేట్ , అంబర్ పేట్, ముసారాంబాగ్, కొత్తపేట, నాగోల్ తదితర ప్రాంతాల్లో మూసీ లో అధిక శాతం ఆక్రమణలు చోటు చేసుకున్నట్లు అధికారులు చేసిన సర్వేలో తేలింది. జియాగూడ కమేలా రోడ్డు, పురాణ పూల్, భూ లక్ష్మమ్మ టెంపుల్ సమీపంలో కొంత మంది మూసీని ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు జరిపి అద్దెలకు ఇచ్చారు . దశాబ్ధాలుగా వీరిని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతూ సొంత ఆస్తులుగా వాడుకుంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఆక్రమణలను తొలగించాలని, తమ వంటి పేద వారి నివాసాలను ధ్వంసం చేయవద్దని చాలా మంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు .

మూసీ భూములలో పట్టాలు...

గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అఫ్జల్ గంజ్, చాదర్ ఘాట్ తదితర ప్రాంతాల్లో మూసీని అనుసరించి కొంతమందికి గడ్డి పెంచుకునేందుకు పట్టాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే క్రమేణా ఆ ప్రాంతాల్లో గడ్డిని పెంచడం మానేసి మూసీని మట్టితో నింపేసి నిర్మాణాలు చేపట్టారు. కొన్ని చోట్ల అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు . దీంతో ఆయా ప్రాంతాల్లో పక్కా నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆయా నిర్మాణాలు కూడా బఫర్ జోన్ లో ఉన్నాయనే అధికారులు ప్రకటించడంతో వారిలో కూడా ఆందోళన మొదలైంది. గ్రేటర్ పరిధిలో 55 కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి ఆస్తుల వివరాలు లెక్కిస్తే ప్రభుత్వం అంచనా వేసిన దానికన్నా అధికంగా ఉండే అవకాశం ఉంది.మొత్తం మీద మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలాది కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది.

Next Story