‘రూల్స్ ఫాలో కాకపోతే లైసెన్స్ క్యాన్సిల్’.. ప్రైవేట్ ఆసుపత్రులకు హెల్త్ మినిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్

by Satheesh |   ( Updated:2024-06-27 15:25:32.0  )
‘రూల్స్ ఫాలో కాకపోతే లైసెన్స్ క్యాన్సిల్’.. ప్రైవేట్ ఆసుపత్రులకు హెల్త్ మినిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిబంధనలు పాటించకపోతే కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. అది ఏ స్థాయిలోని ఆసుపత్రి అయినా, ఊపేక్షించేది లేదన్నారు. ప్రజల కంటే తమ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని నొక్కి చెప్పారు. గురువారం వెంగళరావు నగర్‌లో ఆయన అన్ని జిల్లాల డీఎమ్ హెచ్‌వోలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీఎమ్‌హెచ్‌వోలు జవాబుదారీ తనంతో పనిచేయాలన్నారు.

నిర్లక్ష్యం పనికిరాదన్నారు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులను విస్తృతంగా తనిఖీలు చేయాలన్నారు. ఎవరినీ వదిలిపెట్టొదన్నారు. తప్పు చేసినోళ్లకు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశాలిచ్చారు. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులపై నిరంతరం మానిటరింగ్ అవసరం అన్నారు. ప్రజలను పీడిస్తే ఊరుకోవద్దని ఆదేశాలిచ్చారు.

30 కి.లో మీటర్లకు ఓ ఆసుపత్రి..

జిల్లా, ఏరియా, పీహెచ్‌సీల మధ్య భౌగోళిక కనెక్టివిటీపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ప్రతీ 30 కి.లో మీటర్ల దూరంలో ఓ ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉండాలన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. పేదవాడికి ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ముఖ్యంగా డీఎమ్‌హెచ్‌వోలు అత్యధిక చొరవ చూపాలన్నారు. ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యుల అటెండెన్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలన్నారు. జిల్లాల వారీగా క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. మౌలిక సదుపాయాలు, మ్యాన్ పవర్‌కు కల్పన కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుపడేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఏజెన్సీ ఏరియాలు అలర్ట్..

వర్షకాలం నేపథ్యంలో ఏజెన్సీ ఏరియాల్లో అలర్ట్‌గా ఉండాలని మంత్రి సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రోగులకు మెరుగైన డైట్‌ను అందించాలన్నారు. డాక్టర్లు విధిగా సమయపాలన, మెరుగైన వైద్య సేవలను అందించేలా డీఎమ్‌హెచ్‌వోలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా విస్తృత సేవలను అందించాలన్నారు. ఆరోగ్య మందిర్‌లలో అదనపు సేవలను అందించడానికి కృషి చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు.

డీఎమ్‌హెచ్‌వోల్లో మార్పు రావాలి..

కొన్ని జిల్లాల్లో డీఎమ్‌హెచ్‌వోల పనితీరు మార్చుకోవాలన్నారు. చాలా మంది డీఎమ్‌హెచ్‌వోలపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటివి పునరావృతమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా పనిచేసేందుకు చొరవ చూపాలన్నారు. డీఎమ్‌హెచ్‌వోలు పనితీరు మార్చుకోకపోతే, వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ, కమిషనర్ ఆర్ వీ కర్ణన్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డీఎంఈ డాక్టర్ వాణీ, డీహెచ్ రవీంద్రనాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed