వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక

by GSrikanth |
వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం ఆ పార్టీ మోసానికి పరాకాష్ట అని అన్నారు. తెలంగాణలో యాసంగిలో పండేదే దొడ్డు వడ్లు అని.. పండని సన్నవడ్లకు బోనస్ ఇస్తామనడం మోసం కాదా?, రైతులు నోట్లలో మట్టికొట్టడం కాదా? అని ప్రశ్నించారు. వానకాలంలో 20 శాతం సన్నాలు, యాసంగిలో 99 శాతం దొడ్డువడ్లు పండుతాయని చెప్పారు. నిరుద్యోగులకు 4 వేల భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, తర్వాత ఆ హామీ ఇవ్వలేదని అసెంబ్లీలో చెప్పారు. వడ్ల విషయంలోనూ మాట తప్పుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సన్నవడ్లకు అని ఎక్కడా చెప్పకుండా వరిధాన్యానికి అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం పండని వడ్లకు ఇస్తామంటున్నారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం వల్లే మనం ఇంత తండి తింటున్నామని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అందరూ వరిధాన్యానికి బోనస్ అనే చెప్పారని అన్నారు. కోటి 20 లక్షల వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలంటే రూ.6 వేల కోట్లు కావాలి. సన్నాలకు మాత్రమే ఇస్తే రూ500 కోట్లు సరిపోతాయి. రూ.4500 కోట్లు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి పాక్షికంగానే ఇస్తున్నారు. గతంలో మాదిరే తొలి విడత కింద 7500 కాకుండా రూ.5 వేలే ఇస్తున్నారు. అసలు ఇదంతా కాదు.. సన్నవడ్లకే మాత్రమే బోనస్ ఇస్తారా? దొడ్డు వడ్లకు కూడా ఇస్తారా? స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. వడ్ల బోనస్ విషయంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చేలా రైతాంగాన్నిఏకం చేసి పోరాడతామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed