మండుటెండలో రైతులు క్యూలో నిలవాల్సిన పరిస్థితి: హరీష్ రావు

by Gantepaka Srikanth |
మండుటెండలో రైతులు క్యూలో నిలవాల్సిన పరిస్థితి: హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీలుగు, జనము విత్తనాల కోసం అన్ని జిల్లాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుండటం బాధాకరం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు విత్తనాలు కూడా సకాలంలో అందించకపోవడం దురదృష్టకరం అన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలో రైతులు క్యూలో నిలవాల్సిన పరిస్థితి వచ్చిందని, కొన్ని చోట్ల పాస్ బుక్కులు లైన్ లో పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నా వ్యవసాయ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పంట కాలం సమీపిస్తున్నా, ముందస్తు ప్రణాళిక రూపొందించి అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైన విత్తనాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పత్తి విత్తనాల కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం అని, కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా..? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని, ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలను పంపిణీ చేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.



Next Story